Breaking News

దేశంలో కరోనా విజృంభణ: జూన్‌లో 4 లక్షల కేసులు.. 12 వేల మరణాలు


దేశంలో మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. జూన్ నెల ప్రారంభం నాటికి 1.80 లక్షలుగా ఉన్న కరోనా పాజిటివ్ కేసులు.. చివరినాటికి 5.85 లక్షలకు చేరాయి. జూన్‌లో ఏకంగా 4 లక్షల మందికి వైరస్ సోకగా.. 12 వేల మంది ప్రాణాలు కోల్పోయారు. మే నెలలో పోలిస్తే పాజిటివ్ కేసులు 2.7 రెట్లు, మరణాలు 2.8 రెట్లు అధికంగా నమోదయ్యాయి. మే నెలలో కరోనా కేసులు 1.5 లక్షలు దాటగా.. 4,267 మంది చనిపోయారు. ఇక, దేశవ్యాప్తంగా మంగళవారం 18,333 కేసులు నిర్ధారణ కాగా.. 510 మందికిపై మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 5.85 లక్షల దాటగా.. మృతుల సంఖ్య 17,412గా నమోదయ్యింది. జూన్ 16 దేశంలో అత్యధికంగా 2003 మరణాలు చోటుచేసుకోగా.. ఆ తర్వాత మంగళవారం అత్యధికంగా 510 మంది మృత్యువాతపడ్డారు. ఇక, ఒకే నెలలో అత్యధికంగా నమోదయిన దేశాల జాబితాలో అమెరికా, బ్రెజిల్ తర్వాత భారత్ మూడో స్థానంలోనూ, కరోనా మృతుల జాబితాలో అమెరికా, బ్రెజిల్, మెక్సికో తర్వాత నాలుగో స్థానంలోనూ నిలిచింది. మహారాష్ట్రలో మంగళవారం ఏకంగా 245 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడ మృతుల సంఖ్య 7,855కి చేరింది. నాలుగో దశ లాక్‌డౌన్ ముగిసిన తర్వాత మహారాష్ట్ర‌లో ఏకంగా 5,569 మంది మృత్యువాతపడ్డారు. ఇదిలా ఉండగా, మంగళవారం పాజిటివ్ కేసులు సంఖ్య 4,878గా నమోదయ్యింది. గడచిన నాలుగు రోజులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే. దీంతో అక్కడ మొత్తం కరోనా కేసుల సంఖ్య 174,761కి చేరింది. కేవలం జూన్ నెలలోనే 1.07 లక్షల మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. తమిళనాడులో మరో 3,943 మందికి వైరస్ సోకింది. ఢిల్లీలో 2,199, కర్ణాటక 947, తెలంగాణ 945, ఆంధ్రప్రదేశ్ 704, ఉత్తరప్రదేశ్ 672, పశ్చిమ్ బెంగాల్‌లో 652, గుజరాత్ 620, బీహార్ 370, రాజస్థాన్ 354, అసోం 343 కొత్త కేసులు బయటపడ్డాయి. బీహార్‌లో ఎనిమిది ప్రాణాలు కోల్పోగా.. ఇంత పెద్ద సంఖ్యలో చనిపోవడం ఇదే తొలిసారి. జమ్మూ కశ్మీర్‌లో మరో 260 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.


By July 01, 2020 at 07:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-india-records-4-lakh-positive-cases-12k-deaths-in-june/articleshow/76721388.cms

No comments