Breaking News

మహారాష్ట్ర: రాజ్‌భవన్‌లో 18 మందికి పాజిటివ్.. స్వీయ నిర్బంధంలోకి గవర్నర్


మహారాష్ట్ర రాజ్‌భవన్‌కు సెగ తాకింది. ఏకంగా 18 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో గవర్నర్‌తో సమీపంలో ఉన్న సిబ్బంది కూడా ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాజ్‌భవన్‌లోని మొత్తం 18 మందికి వైరస్ నిర్ధారణ కావడంతో మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. మొత్తం రాజ్‌భవన్‌లోని 100 మందికి కోవిడ్ నిర్దారణ పరీక్షలను నిర్వహించగా.. 18 మందికి పాజిటివ్‌గా తేలింది. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌లకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో ముంబయిలోని నానావతి హాస్పిటల్‌లో చేరారు. వీరికి వైరస్ నిర్ధారణ అయిన కొద్ది గంటల్లోనే రాజ్‌భవన్‌లో 18 మంది పాజిటివ్‌గా తేలింది. దేశంలోనే అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఏకంగా 2,46,600 మందికి వైరస్ నిర్ధారణ కాగా.. 10వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. శనివారం ఏకంగా 8,139 మందికి రికార్డుస్థాయిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని పలు నగరాల్లో పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ను విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. జులై 14 నుంచి పుణే, థానే, పింప్రీ-చింఛువాడ తదితర నగరాల్లో 10 రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమల్లో ఉంటుంది. దేశంలోని మొత్తం కేసుల్లో మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక, తెలంగాణ సహా ఎనిమిది రాష్ట్రాల్లోనే 90 శాతం ఉన్నాయి. అలాగే 80 శాతం యాక్టివ్ కేసులు 49 జిల్లాల్లోనే ఉన్నట్టు కరోనాపై ఏర్పాటుచేసిన మంత్రుల బృందం తెలిపింది. ఇక, ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం రికార్డుస్థాయిలో పాజిటివ్ కేసులు నమోదయినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. 24 గంటల్లో 2.28 లక్షల కేసులు నమోదుకాగా.. అమెరికా, బ్రెజిల్, భారత్, దక్షిణాఫ్రికాలో భారీగా కొత్త కేసులు వెలుగుచూశాయి.


By July 12, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-18-test-positive-at-maharashtra-raj-bhavan-governor-in-self-isolation/articleshow/76918745.cms

No comments