Breaking News

భారత్‌లో 15 లక్షల దాటిన కోవిడ్ బాధితులు.. దేశవ్యాప్తంగా నిన్న ఏపీలోనే అత్యధిక కేసులు


దేశంలో కేసుల సంఖ్య 15 లక్షలు దాటింది. కేవలం 12 రోజుల్లోనే ఐదు లక్షలకుపైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మంగళవారం దేశవ్యాప్తంగా 49,292 మంది కొత్తగా వైరస్ బారినపడగా.. 781 మంది చనిపోయారు. జులై 24న అత్యధికంగా దేశంలో 757 మంది ప్రాణాలు కోల్పోగా.. ఆ రికార్డును మంగళవారం నాటి మరణాలు అధిగమించాయి. అమెరికా (44.3 లక్షలు), బ్రెజిల్ (24.4 లక్షలు) తర్వాత అత్యధికంగా 15 లక్షల కేసులతో భారత్ మూడో స్థానంలో కొనసాగుతోంది. తర్వాతి రష్యా 8.2 లక్షల కేసులతో నాలుగో స్థానంలో ఉంది. దేశంలో వైరస్ మొదలైన తర్వాత రోజువారీ పాజిటివ్ కేసుల్లో మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా.. మంగళవారం మాత్రం ఆ స్థానాన్ని ఆంధ్రప్రదేశ్ ఆక్రమించింది. ఆంధ్రప్రదేశ్‌లో 7,948 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలో ఈ సంఖ్య 7,717గా ఉంది. తమిళనాడు (6,972), కర్ణాటక (5,536), ఉత్తరప్రదేశ్ (3,490), బీహార్ (2,480), బెంగా్ (2,134), అసోం (1,348), కేరళ (1,167), పంజాబ్ (612)లో రోజువారీ కేసులు రికార్డుస్థాయిలో మంగళవారం నిర్ధారణ అయ్యాయి. మంగళవారం నాటి కేసులతో ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,297కి చేరాయి. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక తర్వాత దేశంలో పాజిటివ్ కేసులు లక్ష దాటిన ఐదో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మహారాష్ట్రలో వరుసగా రెండో రోజు కోలుకున్నవారి సంఖ్య పాజిటివ్ కేసులను మించింది. ముంబయిలోనూ బాధితులు నాలుగు రెట్టు అధికంగా కోలుకోవడం విశేషం. అక్కడ పాజిటివ్ కేసులు తక్కువ సంఖ్యలో నమోదయ్యాయి. ఢిల్లీలోనూ పాజిటివ్ కేసులు 1056 నమోదుకాగా.. మొత్తం కేసుల సంఖ్య 1,32,275కి చేరింది. అయితే, వీరిలో 1.17 లక్షల మంది కోలుకోవడం శుభపరిణామం. అక్కడ కేవలం 10,887 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఇప్పటి వరకూ 3,881 మంది కోవిడ్-19తో ప్రాణాలు కోల్పోయారు. తెలంగాణలో మరో 1,610 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది.


By July 29, 2020 at 07:53AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/covid-tally-crosses-15-lakh-in-india-maharashtra-dislodged-by-andhra-on-tuesday/articleshow/77232298.cms

No comments