Breaking News

ఎడారిలో రాజకీయ సంక్షోభం: విప్ జారీ.. గెహ్లాట్‌కు 109 మంది మద్దతుందన్న కాంగ్రెస్


రాజస్థాన్‌లో ఏర్పడిన రాజకీయ సంక్షోభానికి తెరపడుతుందా? లేదా? అనేది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. డిప్యూటీ సీఎం సచిన్ తన వెంట 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చేసిన ప్రకటనతో నేడు జరిగే సీఎల్పీ సమావేశంపై ఉత్కంఠ నెలకుంది. అయితే, గెహ్లాట్‌కు 109 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని కాంగ్రెస్ ప్రకటించింది. సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటుచేసిన కాంగ్రెస్.. ఎమ్మెల్యేలకు విప్ జారీచేసింది. తాను సీఎల్పీ సమావేశానికి హాజరుకాబోనంటూ సచిన్ స్పష్టం చేశారు. దీంతో గెహ్లాట్‌కు ఎంత మంది మద్దతుగా నిలుస్తారనేది చర్చనీయాంశమయ్యింది. పైలట్‌కు ముఖ్యమంత్రి పదవిపై బీజేపీ భరోసా ఇవ్వలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయన సొంత కుంపటి పెట్టుకుంటారనే ప్రచారం సాగుతోంది. దీంతో మరోసారి రాష్ట్ర అసెంబ్లీలో గణాంకాలు తెరపైకి వచ్చాయి. మొత్తం 200 మంది సభ్యులున్న రాజస్థాన్ అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమై సంఖ్య 101. ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 107, ఇతరులతో కలిసి 121 మందితో ప్రభుత్వాన్ని నడుపుతోంది. వాస్తవానికి ఈ సంఖ్య ఐదేళ్లూ స్థిరమైన ప్రభుత్వం నడపడానికి సరిపోతుంది. అయితే, సీఎంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న పైలట్ వర్గం ఇప్పుడు పార్టీని మారే ఆలోచనలో ఉంది. ఆయన వెంట 15 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు స్వతంత్రులు ఉన్నట్టు తెలుస్తోంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్‌కు 101 మంది ఎమ్మెల్యేలుండగా, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కూటమిలో భాగంగా ఉన్నారు. వీరికి 10 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు, సీపీఐ-ఎం, భారతీయ ట్రైబల్ పార్టీలకు చెందిన ఇద్దరేసి సభ్యుల మద్దతు ప్రస్తుతం ఉంది. బీజేపీ, రాష్ట్రీయ లోక్ తాంత్రిక్ పార్టీ సభ్యులు ముగ్గురితో కలిపి 73 మంది ఎమ్మెల్యేల బలముంది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలదోయాలంటే, బీజేపీకి కనీసం మరో 28 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. వర్గానికి చెందిన 18 మంది బీజేపీకి మద్దతుగా నిలుస్తారని అనుకున్నా, మరో 10 మంది ఎమ్మెల్యేలు అవసరమవుతారు.


By July 13, 2020 at 09:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-claims-support-of-109-mlas-in-rajasthan-clp-has-issued-a-whip-to-its-mlas/articleshow/76932515.cms

No comments