Breaking News

ఈసారి హజ్ యాత్రకు 1000 మందే.. సౌదీ ప్రభుత్వం కీలక నిర్ణయం


ముస్లీంలు అతి పవిత్రంగా భావించే హజ్ యాత్రపై కూడా కరోనా పంజా విసిరింది. ప్రతీ ఏటా బక్రీద్ పండగకు నెల రోజుల ముందుగానే ప్రపంచం నలుమూలలకు చెందిన వేలాది ప్రజలు మక్కా యాత్రకు బయల్దేరతారు. లక్షలాది ప్రజలు పాల్గొనే ఆ పవిత్ర యాత్రపై కూడా కరోనా ఎఫెక్ట్ చూపించింది. కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ సారి అత్యంత సాదా సీదాగా హజ్ యాత్ర జరపాలని సౌదీ సర్కార్ నిర్ణయించింది. ఈ సారి హజ్‌కు కేవలం 1000 మందిని మాత్రమే అనుమతించనున్నట్లు ప్రకటించింది. జులై 29న ఈ యాత్ర ప్రారంభం కానున్నట్లు వెల్లడించింది. సౌదీ అరేబియాలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి సుప్రీం కోర్టు సూచన మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారిక సౌదీ ప్రెస్‌ ఏజెన్సీ తెలిపింది. అయితే హజ్ యాత్రలో పాల్గొనే ఆ వేయిమంది కూడా కేవలం సౌదీలో నివసిస్తున్న వారు మాత్రమే. అక్కడ ఉన్న వారికే ఈసారి హజ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు అనుమతించనున్నారు. వీరిలో 30 శాతం మంది సౌదీ దేశస్థులు కాగా.. మరో 70 శాతం మంది సౌదీలో నివసిస్తున్న విదేశీయులు ఉండనున్నట్లు సౌదీ హజ్‌ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల నుంచి వచ్చే యాత్రికుల్ని ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది లేదని స్పష్టం చేసింది. విదేశీయుల్ని ఇలా హజ్‌కు అనుమతించకపోవడం ఆధునిక సౌది చరిత్రలో ఇదే తొలిసారి. కరోనా వైరస్ నేపథ్యంలో యాత్రా స్థలంలో కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది అక్కడి ప్రభుత్వం. మక్కాకు చేరుకోవడానికి ముందే యాత్రికులందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. అలాగే యాత్ర తర్వాత వారంతా గృహ నిర్బంధంలో ఉండాల్సి ఉంటుంది. ఏటా ఈ యాత్రకు దాదాపు 2.50 లక్షల మంది హాజరవుతుంటారని అంచనా. ఇప్పటికే భారత్‌ నుంచి ఈసారి హజ్‌ యాత్రను రద్దు చేస్తున్నట్లు ఇక్కడి హజ్‌ కమిటీ ప్రకటించిన విషయం తెలిసిందే.


By July 21, 2020 at 10:24AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/saudi-arabia-to-allow-around-1000-pilgrims-in-hajj-2020/articleshow/77078513.cms

No comments