Breaking News

సర్జికల్ స్ట్రయిక్స్ ముందు కూడా ప్రధాని ఇలాగే అన్నారు..చైనాకు లడఖ్ ఎంపీ హెచ్చరిక


సోమవారం రాత్రి కుట్రపూరితంగా భారత సైన్యాలను ఉచ్చులోకి లాగి దొంగ దెబ్బ తీసిన డ్రాగన్.. భారత్‌కు చెందిన గాల్వన్ లోయలోకి అక్రమంగా చొరబడటమే కాదు.. ఆ ప్రాంతంపై సార్వభౌమాధికారం తమదంటూ చైనా వాదిస్తోంది. చైనా ప్రకటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. చైనా అతిశయోక్తులు మాట్లాడుతోందని, రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను గౌరవించాలని భారత్‌ గురువారం స్పష్టం చేసింది. దాన్ని మార్చేందుకు ఏకపక్ష చర్యలకు పూనుకోవద్దని హితవు పలికింది. ఇదిలా ఉండగా.. చైనాకు గుణపాఠం చెప్పి, 1962 యుద్ధంలో ఆ దేశం ఆక్రమించుకున్న అక్సాయ్ చిన్ భూభాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని లడఖ్ బీజేపీ ఎంపీ జమ్యాంగ్ సేరింగ్ నాంగ్యాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 20 మంది జవాన్లు అమరులైన తరుణంలో ఇక ఉపేక్షించడం అనవసరమని... శాశ్వత పరిష్కారం కావాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఉరి ఉగ్రదాడి తర్వాత 2016లో పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌కు ముందు ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలే చేశారని ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. లడఖ్ ప్రజలంతా దేశం, సైన్యం వెంటే ఉన్నారని, భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తామని ఆయన ఉద్ఘాటించారు. కేవలం లడఖ్ ప్రజలు మాత్రమే కాకుండా భారతీయులంతా వన్ టైమ్ సొల్యూషన్ కోరుకుంటున్నారని అన్నారు. మన సైనికులు తరచూ అసువులుబాయడం.. సరిహద్దుల్లోని ప్రజలు ఇబ్బందులకు గురి కావడాన్ని తాము కోరుకోవడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. అందుకే వన్ టైమ్ సొల్యూషన్‌ను తాము కోరుకుంటున్నామని అన్నారు. 1962 నుంచి ఇప్పటి వరకు భారత్‌ను చైనా ఒకటి రెండుసార్లు కాదు.. కొన్ని వందల సార్లు మోసగించిందని నాంగ్యాల్ ఆరోపించారు. 1962 యుద్ధంలో భారత్ కు చెందిన 37,244 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని (అక్సాయ్ చిన్) ఆక్రమించుకుందని అన్నారు. అక్సయ్ చిన్ అనే పదాన్ని కూడా తాను వినలేనని.. అది చైనా ఆక్రమించుకున్న లడఖ్‌లోని భారత భూభాగమని చెప్పారు. ఆ ప్రాంతాన్ని భారత్ వెనక్కి తీసుకోగలదా? అని చాలా మంది ప్రశ్నిస్తుంటారని... అది అంత సులభం కాకపోయినా, అసాధ్యం మాత్రం కాదని స్పష్టం చేశారు. మన సైనికుల త్యాగాల తర్వాత... అక్సాయ్ చిన్‌ను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు సమయం ఆసన్నమైందని తాను నమ్ముతున్నానని అన్నారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న ప్రభుత్వం 1962 నాటిది కాదని, ప్రధాని మోదీ ఏది చెబితే అది చేసి తీరుతారని నాంగ్యాల్ అన్నారు. తమ సైనికుల ప్రాణ త్యాగాలను వృథా పోనివ్వమని పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రయిక్స్‌కి ముందు మోదీ చెప్పారని... బుధవారం మరోసారి అదే మాటను చెప్పారని అన్నారు. ప్రభుత్వ ఆలోచన ఏ విధంగా ఉందో, ఏం చేయబోతోందో ఆ మాటతో తనకు అర్థమవుతోందని చెప్పారు.


By June 19, 2020 at 08:33AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/border-rowladakh-mp-warns-china-pm-modi-used-same-line-before-surgical-strikes/articleshow/76456091.cms

No comments