Breaking News

మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో 730 మందికి కరోనా వైరస్.. క్వారంటైన్‌లోకి 7వేల మంది


జర్మనీలో తొలినాళ్లలో కేసులు పెద్ద సంఖ్యలో నమోదయినా.. ప్రాణనష్టం మాత్రం తక్కువగానే ఉంది. తాజాగా, నార్త్ రైన్-వెస్ట్‌ఫాలియా (ఎన్ఆర్‌డబ్ల్యూ)లోని ఓ కబేళాలో పనిచేసే 730 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. దీంతో గ్యుటేర్స్‌లోహ్ జిల్లాలోని టోనీస్ గ్రూప్‌ మీట్ ప్యాకింగ్ ప్లాంట్‌ను తాత్కాలికంగా మూసివేస్తూ స్థానిక అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 7 వేల మందిని క్వారంటైన్‌లో ఉంచారు. జూన్ 29 వరకు పాఠశాలలు, డేకేర్ సెంటర్లను మూసివేస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వచ్చే నాలుగైదు రోజుల్లో 5 వేలకుపైగా కొవిడ్-19 పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్టు స్థానిక మీడియా వెల్లడించింది. మరోవైపు ఈ ప్లాంటులో కరోనా వైరస్ ఎలా వ్యాపించిందనే విషయం ఎన్ఆర్‌డబ్ల్యూ ప్రభుత్వం విచారణ చేపట్టింది. తమ ప్లాంట్‌లో వందలాది మంది విదేశీయులు పనిచేస్తున్నారని, వీరంతా ఇటీవల ప్రయాణాలు చేశారని పరిశ్రమ క్వాలిటీ మేనేజ్‌మెంట్ అండ్ వెటర్నరీ సర్వీసెస్ డైరెక్టర్ గేరోన్ షెహుల్జే అల్తాఫ్ అన్నారు. కార్మికుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని, కరోనా వైరస్‌ వ్యాప్తికి ప్లాంట్ మూలకారణం కారాదని తెలిపారు. అయితే, పరిశ్రమల్లో సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లే వైరస్ సోకుతున్నట్టు అధికారులు పేర్కొంటున్నారు. జర్మనీలోని కబేళాల్లో దాదాపు 2 లక్షల మంది విధులు నిర్వర్తిస్తుండగా.. వీరిలో మూడొంతుల మంది విదేశీయులే కావడం గమనార్హం. తాజా పరిణామాలతో జర్మనీ ప్రభుత్వం మేల్కొంది. కబేళాల్లో పనిచేసే కార్మికుల రక్షణ కోసం కొత్త చట్టాలను తీసుకురానున్నట్టు ప్రకటించింది. గత నెల ఇదే రాష్ట్రంలోని కోస్‌ఫెల్డ్‌ జిల్లాకి చెందిన మరో మీట్ ప్రాసెసింగ్ ప్లాంట్‌లో 200 మందికి కరోనా వైరస్ సోకినట్టు గుర్తించారు. ఇప్పటి వరకూ జర్మనీలో 1.90 లక్షలకుపైగా కరోనా కేసులు నిర్ధారణ కాగా.. దాదాపు 9వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ఐరోపాలోని అన్ని దేశాలూ కరోనాతో కకావికలం కాగా.. జర్మనీ మాత్రం సరైన వ్యూహంతో వైరస్‌పై పోరాటం చేస్తోంది.


By June 19, 2020 at 09:06AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/germany-reports-730-new-coronavirus-cases-in-a-meat-processing-plant/articleshow/76456508.cms

No comments