Breaking News

ఆగని కరోనా విజృంభణ.. నేటి నుంచే తెరుచుకోనున్న ఆలయాలు, మాల్స్


కట్టిడికి విధించిన లాక్‌డౌన్‌తో రెండున్నర నెలలుగా మూతపడిన ప్రార్థనా మందిరాలు, ఆలయాలు, షాపింగ్‌ మాల్స్, హోటల్స్, రెస్టారెంట్స్ సోమవారం నుంచి తెరచుకోనున్నాయి. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 600, 10 మరణాలు ఉన్నప్పుడు ఈ వ్యవస్థలన్నీ మూతపడ్డాయి. ఇప్పుడు 2.57 లక్షల కేసులు, 7వేలకుపైగా మరణాలు నమోదైన తరుణంలో తిరిగి తెరుచుకుంటున్నాయి. లాక్‌డౌన్ కారణంగా సంక్షోభంలో కురుకుపోయిన ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించే క్రమంలో ఓక్కో వ్యవస్థలో కార్యకలాపాలకు అనుమతిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో జూన్‌ 1 నుంచి అన్‌లాక్‌-1 మొదలుపెట్టి కంటెయిన్‌మెంట్‌ జోన్ల వెలుపల అన్ని రకాల ఆర్థిక కార్యకలాపాల నిర్వహణకు పచ్చ జెండా ఊపారు. ఇందులో భాగంగా ప్రార్థన స్థలాలు, హోటల్స్, రెస్టారెంట్స్, ఆతిథ్య సేవలు, షాపింగ్‌ మాల్స్‌, ప్రాచీన కట్టడాలను తెరవడానికి కేంద్రం జూన్ 4న మార్గదర్శకాలను జారీచేసింది. నిబంధనల ప్రకారం జాగ్రత్తలు పాటిస్తూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహించుకోవాల్సి ఉంటుంది. కేసులు పెరుగుతున్న తరుణంలో ప్రధానమైన వ్యాపార కార్యకలాపాలన్నింటినీ ప్రారంభించడం ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వానికి సవాల్‌తో కూడుకున్న అంశమే. అయితే, ఈ విషయంలో నిర్ణయం తీసుకొనే స్వేచ్ఛను రాష్ట్రాలకే కేంద్ర ప్రభుత్వం విచిడిపెట్టింది. దేశవ్యాప్తంగా 820 స్మారక స్థలాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను పర్యాటకుల కోసం తెరస్తున్నట్లు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి ప్రహ్లాద్‌సింగ్‌ పటేల్‌ ఆదివారం సాయంత్రం వెల్లడించారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఆధ్వర్యంలో నడిచే మతపరమైన ప్రదేశాలను నిబంధనలకు అనుగుణంగా ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. తాజ్‌మహల్‌తోపాటు దేశంలోని పర్యాటక ప్రదేశాలన్నీ సందర్శకుల కోసం తెరచుకోనున్నాయి. ఈ 820 కేంద్రాల్లో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రదేశాలు ఉన్నాయి. తెలంగాణలో జోగులాంబ గద్వాల జిల్లాలోని నవబ్రహ్మ ఆలయం, వరంగల్‌లోని వేయి స్తంభాల గుడి, రామప్ప ఆలయాలు, ఆంధ్రప్రదేశ్‌‌లోని ప్రఖ్యాత ఒంటిమిట్ట, యాగంటి, లేపాక్షి, ద్రాక్షారామ, సామర్లకోట, భీమవరం, పుష్పగిరితోపాటు 28 ప్రదేశాలు, పలు ఆలయాలున్నాయి. మరోవైపు, దేశంలో మహమ్మారి విజృంభణ ఏమాత్రం తగ్గుముఖం పట్టడంలేదు. రోజూ కొత్త కేసులు రికార్డుస్థాయిలో నమోదవుతున్నాయి. గడచిన రెండు రోజుల నుంచి సగటున 10వేలకుపైగా కొత్త కేసులు నమోదుకావడం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా, మాల్స్, ఆలయాలను తెరవడంతో ఈ సంఖ్య మరింత పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహాం లేదు. ఈ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


By June 08, 2020 at 07:32AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-positive-cases-cross-2-5lakhs-toll-7k-as-malls-shrines-set-to-open/articleshow/76252406.cms

No comments