Breaking News

క్యాబినెట్ మంత్రి, ఆయన వ్యక్తిగత సిబ్బందిలో ఐదుగురికి కరోనా


మహమ్మారి విశ్వరూపం కొనసాగుతోంది. దేశంలోనే అత్యధికంగా పాజిటివ్ కేసులు ఆ రాష్ట్రంలోనే నమోదువుతున్నాయి. ఆర్దిక రాజధాని ముంబయి కరోనా తీవ్రతకు కకావికలమవుతోంది. అలాగే, పలువురు ప్రముఖులు సైతం కరోనా బారినపడ్డారు. మహారాష్ట్రలో ఇప్పటికే ఇద్దరు మంత్రులకు కరోనా సోకగా.. తాజాగా మరో మంత్రికి వైరస్ నిర్ధారణ అయ్యింది. క్యాబినెట్ మంత్రి ధనుంజయ్ ముండేతోపాటు ఆయన సిబ్బందిలో ఐదుగురికి వైరస్ నిర్ధారణ అయ్యింది. దీంతో అందరినీ ఐసోలేషన్‌కు తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు తెలిపారు. ఇప్పటికే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ఉద్ధవ్ ఠాక్రే క్యాబినెట్‌లో మంత్రి అశోక్ చవాన్‌కు గత నెలలో వైరస్ నిర్ధారణ అయ్యింది. అలాగే, హౌసింగ్ మంత్రి జితేంద్ర అవధ్ సైతం ఏప్రిల్‌లో వైరస్ బారినపడి కోలుకున్నారు. నెల రోజుల పాటు ముంబయిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందిన అనంతరం ఆయన కోలుకుని ఇంటికెళ్లారు. కాగా, గురువారం మహారాష్ట్రలో 3,607 కొత్త కేసులు నమోదు కావడంతో.. మొత్తం బాధితుల సంఖ్య 97,648కి చేరింది. దీంతో పాజిటివ్ కేసుల్లో కెనడాను మహారాష్ట్ర దాటేసింది. తొలిసారిగా ఒక్క రోజు మహారాష్ట్రలో 3,500కిపైగా కేసులు నమోదయ్యాయి. అలాగే, మరో 152 మంది మృతిచెందారు. అయితే, రికవరీ రేటు మాత్రం ఎక్కువగా ఉండటం సానుకూలంశం. ఇప్పటి వరకూ 97,648 మందికి వైరస్ సోకగా.. వీరిలో 46,078 మంది కోలుకున్నారు. మొత్తం 3,590 మంది కరోనాకు బలయ్యారు.


By June 12, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/maharashtra-minister-dhananjay-munde-and-his-personal-staff-tested-covid-19-positive/articleshow/76334605.cms

No comments