Breaking News

కశ్మీర్‌లో కొనసాగుతున్న సైన్యం వేట.. మరో నలుగురు ఉగ్రవాదులు హతం


జమ్మూ కశ్మీర్‌లో మరో ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. అవంతిపొర పాంపొర్ వద్ద మీజ్‌ ప్రాంతంలోని ఓ మసీదులో దాక్కున్న ముగ్గురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చినట్టు జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్బాబ్‌సింగ్ శుక్రవారం వెల్లడించారు. ఈ ముగ్గురిలో ఓ ఉగ్రవాదిని గురువారం ఉదయమే సైన్యం హతమార్చగా.. మసీదులో దాక్కున్న మిగతా ఇద్దర్నీ ఆపరేషన్ అనంతరం కాల్చిచంపిందన్నారు. ఇంకా, ఎవరైనా ఉగ్రవాదులు ఉన్నారేమోనన్న అనుమానంతో ఆ ప్రాంతంలో ముమ్మర సోదాలు కొనసాగుతున్నాయని తెలిపారు. మీజ్ వద్ద గురువారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఓ గుర్తుతెలియని ఉగ్రవాది హతమైనట్టు భద్రత బలగాలు తెలిపాయి. మీజ్ వద్ద భద్రతా దళాలు తనిఖీలు చేస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. అనంతరం సమీపంలోని ఓ మసీదులో దాక్కున్నారు. దీంతో సైన్యం వారిని బయటకు రప్పించేందుకు ప్రయత్నించగా.. ముష్కరులు భారీగా కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు ప్రారంభించడంతో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కశ్మీర్ పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. షోపియాన్ జిల్లాలోని మునాంద్‌లోనూ మరో ఐదుగురు ఉగ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. దీంతో గురువారం ఉదయం నుంచి శుక్రవారం వరకు 24 గంటల్లో ఎనిమిది మంది ఉగ్రవాదులను సైన్యం కాల్చిచంపినట్టయ్యింది. ఆ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం సైన్యం గాలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. రెండు రోజుల కిందట షోపియాన్ జిల్లాలో ముగ్గురు గుర్తుతెలియని ఉగ్రవాదులను సైన్యం కాల్పిచంపిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం శ్రీనగర్‌కు 60 కిలోమీటర్ల దూరంలోని తుర్కవాంగమ్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో ముగ్గురు తీవ్రవాదులు హతమైనట్టు జమ్మూ కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. 44 రాష్ట్రీయ రైఫిల్స్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ 178 బెటాలియన్, జమ్మూ కశ్మీర్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారు.


By June 19, 2020 at 10:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-three-terrorists-trapped-at-pampore-two-more-in-shopian-are-neutralised/articleshow/76458163.cms

No comments