Breaking News

భారత్‌‌పై ‘ఉగ్ర’ముద్రకు కుట్ర.. ఐరాసలో పాక్ ప్రయత్నాలకు అమెరికా చెక్


జైషే మొహమూద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజార్‌పై నిషేధం విధించిన తర్వాత సరిహద్దు ఉగ్రవాద సమస్యపై భారత్‌తో నైతిక సమానత్వం తీసుకురావడానికి దాయాది పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలను అమెరికా అడ్డుకుంది. ఓ భారత జాతీయుడిపై ఉగ్రవాదిగా ముద్రవేయడానికి యూఎన్ఎస్సీ 1267 ఆంక్షల కమిటీకి పాక్ చేసిన ప్రతిపాదనను అధికారికంగా అడ్డుకుంటున్నట్లు ఐరాస భద్రతా మండలిలో సభ్యులందరికీ అమెరికా అధికారికంగా శుక్రవారం వెల్లడించినట్టు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఆఫ్గనిస్థాన్‌లోని భారత నిర్మాణ సంస్థలో ఇంజనీర్‌గా విధులు నిర్వర్తిస్తోన్న వేణు మాధవ్ డోంగారా తమ భూభాగంలోని ఉగ్రవాద కార్యకలాపాలు, దాడులతో సంబంధం కలిగిన నలుగురు భారతీయుల్లో ఒకరని పేర్కొంటూ చైనా మద్దుతుతో ఆయనను అంతర్జాతీయ ఉగ్రవాది జాబితాలోకి చేర్చడానికి పాకిస్థాన్ కుటిల ప్రయత్నం చేస్తోంది. పాకిస్థాన్ చేసిన ఈ ప్రతిపాదనను సాంకేతిక కారణాలను సాకుగా చూపుతూ గతేడాది సెప్టెంబరులో అమెరికా దీనిని తిరస్కరించింది. డోంగారా ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడినట్టు బలమైన ఆధారాలు చూపాలని పాక్‌ను కోరింది. అయితే, ఇప్పటి వరకూ ఎలాంటి కొత్త ఆధారాలను చూపించని పాకిస్థాన్.. తాజాగా మరోసారి ఆంక్షల కమిటీ ముందు ప్రస్తావించింది. ఈ ప్రతిపాదనను అమెరికా గతవారం అడ్డుకుని, అధికారికంగా ముగించింది. ఒకవేళ డోంగారాను పాక్ టార్గెట్ చేసుకుంటే, కొత్త ప్రతిపాదన చేయాల్సి ఉంటుంది. గతేడాది జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌పై ఐరాస నిషేధం విధించిన తరువాత, డోంగారాను లక్ష్యంగా చేసుకోవాలన్న పాక్ నిర్ణయాన్ని అమెరికా వంటి మిత్ర దేశాలు భారత్‌ను ఉగ్రవాద దేశంగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా భావించాయి. గతంలో నాలుగు సార్లు నిషేధంపై భద్రతా మండలిలో ప్రతిపాదనను చైనా అడ్డుకోగా.. చివరకు 2019లో ఇతర యుఎన్‌ఎస్సీ సభ్య దేశాలు మద్దతు ఇవ్వడంతో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించారు. భారత ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం.. ఉగ్రవాద దాడులకు భారత్ ఆర్థిక సహాయం చేస్తుందని, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ వంటి సంస్థలతో కలిసి దాడులకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ డోంగరాపై ఓ ‘కల్పిత’ ప్రతిపాదనను పాక్ సిద్ధం చేసింది. ఆఫ్గన్‌లో ఒక భారతీయ నిర్మాణ సంస్థలో పనిచేస్తున్న మరో ముగ్గురు భారతీయ పౌరులపై ఇలాంటి ఆరోపణలు చేసింది. దీంతో వీరంతా అప్పటి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చారు. ‘పాకిస్థాన్ ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు చేస్తుందని తాము ఊహించలేదు. అజార్ విషయంలో చైనా కూడా ప్రతిపాదిత నిషేధాన్ని సమర్ధించాల్సి వచ్చింది.. ఎందుకంటే అతడు ఉగ్రవాద దాడులకు సూత్రధారి మాత్రమే కాదు, ఐరాస ఇప్పటికే నిషేధించిన ఒక సంస్థకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు’ అని భారత అధికారులు వ్యాఖ్యానించారు.


By June 23, 2020 at 08:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/united-nations-security-council-us-blocks-pakistans-effort-to-term-india-terror-backer/articleshow/76522410.cms

No comments