Breaking News

మహారాష్ట్ర సంచలన నిర్ణయం.. రూ.5వేల కోట్ల చైనా ప్రాజెక్టులు రద్దు


సంస్థలతో చేసుకున్న రూ.5000 కోట్ల విలువైన మూడు ఒప్పందాలను రద్దుచేసుకున్నట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇటీవల మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0 పేరుతో నిర్వహించిన పెట్టుబడుల సదస్సులో మూడు చైనా సంస్థలతో రూ.5000 కోట్లకుపైగా ఒప్పందాలను చేసుకుంది. అయితే, సరిహద్దుల్లో చైనా సైన్యం దాష్టికానికి తెగబడటంతో ఈ ఘటనపై దేశవ్యాప్త నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా చైనా సంస్థలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకోవద్దని విదేశాంగ శాఖ కోరింది. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. ‘కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం.. వీటిపై ఇండో-చైనా సరిహద్దులో 20 మంది భారతీయ సైనికులను చంపడానికి ముందు సంతకరం చేశాం.. చైనా కంపెనీలతో తదుపరి ఒప్పందాలు కుదుర్చుకోవద్దని విదేశాంగ మంత్రిత్వ శాఖ సూచించింది’ అని మహారాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి సుభాష్ దేశాయ్ అన్నారు. గత సోమవారం ఆన్‌లైన్ ద్వారా జరిగిన మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0కి భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ హాజరుకాగా.. పుణే సమీపంలోని తలేగావ్ వద్ద ఆటోమొబైల్ ప్లాంట్ ఏర్పాటుకు చైనాకు చెందిన గ్రేట్ వాల్ మోటార్స్ సంస్థతో రూ.3,770 కోట్ల మేర అవగాహన ఒప్పందాలు కుదిరాయి. అలాగే, పీఎంఐ ఎలక్ట్రో మొబిలిటీతో కలిసి చైనాకు చెందిన ఫోటన్ రూ.1000 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వీటితోపాటు చైనాకు చెందిన హెంగ్లీ ఇంజినీర్స్ రూ.250 కోట్లతో తలేగావ్‌లో ప్లాంట్‌లో రెండో దశ విస్తరణకు ఒప్పందం చేసుకుంది. మాగ్నటిక్ మహారాష్ట్ర 2.0లో సింగ్‌పూర్, దక్షిణ కొరియా, అమెరికా సహా దేశీయ సంస్థలు మొత్తం 12 ఒప్పందాలు కుదిరాయి. చైనాతో మూడు ఒప్పందాలను రద్దుచేసుకుంటున్నామని, మిగతా 9 మాత్రం కొనసాగుతాయని మంత్రి అన్నారు. ఈ ఏడాది జనవరిలో గ్రేట్ వాల్ మోటార్స్‌తో ఒప్పందం కుదిరింది. తలేగావ్‌లో ప్లాంట్ ఏర్పాటుచేసి ఎలక్ట్రికల్ వాహనాలు తయారుచేయాలని భావించింది. భారత్‌లో మొత్తం రూ.7,600 కోట్ల పెట్టుబడులకు కట్టుబడి ఉన్నామని జీడబ్ల్యూఎం ప్రకటించింది.


By June 22, 2020 at 08:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/china-border-row-maharashtra-freezes-3-chinese-projects-worth-rs-5000-crore/articleshow/76502368.cms

No comments