Breaking News

నాగబాబు- బాలకృష్ణ ఇష్యూ: తన వ్యాఖ్యలపై మీడియా ముందు మెగా బ్రదర్ రియాక్షన్


ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో నాగబాబు- ఇష్యూ హాట్ టాపిక్ అయింది. కరోనా కల్లోల పరిస్థితుల నుంచి బయటపడటం, థియేటర్స్ రీ ఓపెన్, షూటింగ్స్ రీ ఓపెన్ లాంటి అంశాలపై చిరంజీవి నేతృత్వంలో పలువురు దర్శకనిర్మాతలంతా కలిసి ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అయితే ఈ చర్చలకు తనను పిలవలేదని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సినిమా వాళ్ళు భూములు పంచుకున్నారా? అని ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో మెగా బ్రదర్ ఎంటరై సంచలన వ్యాఖ్యలు చేశారు. నోరు అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు. దీంతో ఈ ఇష్యూపై చర్చలు ముదిరాయి. ఈ నేపథ్యంలో ఓ మీడియా ఛానల్‌ నాగబాబుతో ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. ఇందులో మాట్లాడిన నాగబాబు తన వ్యాఖ్యలపై రియాక్ట్ అవుతూ వివరణ ఇచ్చారు. ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు హాజరైన ఆ సమావేశానికి ఎన్టీఆర్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తిని పిలవాల్సిన అవసరం లేదా? అని ఛానల్ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిచ్చిన నాగబాబు.. ఆయనను చర్చలకు పిలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. బాలకృష్ణతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, అలాగే ఆయనపై నెగెటివ్ ఒపీనియన్, శత్రుత్వం లేదని.. గతంలో కూడా బాలకృష్ణను కమెడియన్ అని తాను అనలేదని నాగబాబు చెప్పారు. తనను మీటింగ్‌కు ఎందుకు పిలవలేదని ఆయన ప్రశ్నించడంలో తప్పు లేదని, అయితే భూములు పంచుకున్నారని అనడం మాత్రం సరైంది కాదని చెప్పారు. సినీ పరిశ్రమ అంటే ఎన్టీఆర్, చిరంజీవి ఫ్యామిలీ మాత్రమే కాదని, వీళ్ళతో పాటు ఏఎన్నార్, కృష్ణ కుటుంబాలతో పాటు మరికొన్ని ఫ్యామిలీలు ఉన్నాయని అన్నారు. మీటింగ్‌కు, ఫ్యామిలీలకు ఎలాంటి సంబంధం లేదని ఆయన చెప్పారు.


By May 29, 2020 at 08:23AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/nagababu-reacted-on-his-comments-on-nandamuri-balakrishna/articleshow/76082781.cms

No comments