Breaking News

కేరళలోకి రుతుపవనాలు వచ్చేశాయ్.. స్కైమెట్ ప్రకటన!


నైరుతి రుతుపవనాలు సోమవారం కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆదివారం దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవులు, బంగాళాఖాతంలోని ఆగ్నేయ ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించే అవకాశం ఉందని తెలిపింది. తూర్పు మధ్య అరేబియా సముద్ర పరిధిలోని ప్రాంతాల్లో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని, ఆ తర్వాత ఇది వాయుగుండంగా మారేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. ప్రస్తుతం ఇది గంటకు 3 కిలోమీటర్ల వేగంతో ఒమన్ దక్షిణ తీరం, యెమన్‌కు వాయువ్గంగా ప్రయాణిస్తోందని వివరించింది. ఒమన్‌‌లోని సలాహ్‌కు ఉత్తరంగా 20 కిలోమీటర్లు, యెమన్‌లోని అల్‌ఘ్‌యాద్‌కు తూర్పు-ఈశాన్య దిశగా 230 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉన్నట్టు తెలియజేసింది. ఆదివారం సాయంత్రం ఇది తీవ్ర వాయుగుండంగా మారతుందని తెలిపింది. అయితే, కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాయని ప్రయివేట్ వాతావరణ సంస్థ శనివారం ప్రకటించడం గమనార్హం. వర్షపాతం, ఔట్‌వేవ్ లాంగ్‌వేవ్ రేడియేషన్ (ఓఎల్ఆర్) విలువ, గాలి వేగం బట్టి చూస్తే కేరళలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్టు నిర్ధారణ అవుతుందని స్కైమెట్ సీఈఓ జతిన్ సింగ్ అన్నారు. మే 28కి అటు ఇటు రెండు రోజుల్లో రుతుపవనాలు కేరళలోకి ప్రవేశిస్తాయని స్కైమెట్ గతంలోనే అంచనా వేసింది. దీనిని మాత్రం కొట్టిపారేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు, వడగాలుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో శనివారం గరిష్ఠంగా పశ్చిమగోదావరి జిల్లా వరదరాజపురంలో 45.82 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కర్నూలు జిల్లాలో 60 మి.మీ. పైగా వర్షం కురిసింది. చిత్తూరు, అనంతపురం, విజయనగరం, శ్రీకాకుళం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని పలుచోట్ల వానలు కురిశాయి. ఉభయగోదావరి జిల్లాల్లోని 11 మండలాల్లో వడగాలుల ప్రభావం అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 352 మండలాల్లో అధిక వేడి, 282 మండలాల్లో వేడి వాతావరణం నెలకొంది. కోస్తా, రాయలసీమల్లో ఆది, సోమవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురవొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని వాతారణ పేర్కొంది. దక్షిణకోస్తా, రాయలసీమల్లో గరిష్ఠంగా 43డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. మరోవైపు ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో 2,100 మీటర్ల ఎత్తువరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ మీదుగా లక్షదీవుల వరకు 0.9 మీటర్ల ఎత్తు వద్ద ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రేపు, ఎల్లుండి రాష్ట్రంలో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ అధికారి రాజారావు తెలిపారు.మరోవైపు ఆగ్నేయ అరేబియా సముద్రప్రాంతంలో వచ్చే 48గంటల్లో అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ కేంద్రం వివరించింది. ఇది బలపడి వాయుగుండంగా మారొచ్చని, దీని ప్రభావంతో నైరుతి రుతుపవనాలు జూన్‌ 1న కేరళలో ప్రవేశించొచ్చని పేర్కొంది.


By May 31, 2020 at 08:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/skymet-announces-arrival-of-southwest-monsoon-over-kerala-imd-differs/articleshow/76115482.cms

No comments