Breaking News

సరిహద్దుల్లో ఎంత బాధ్యతగా ఉండాలో మాకు తెలుసు.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్


సరిహద్దుల్లో నియంత్రణ రేఖను దాటి ఇండియన్ ఆర్మీ తమ భూభాగంలోకి చొచ్చుకొస్తుందన్న చైనా ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది. వాస్తవానికి భారత సైన్యం సాధారణ పెట్రోలింగ్‌ను చైనా బలగాలే అడ్డుకుంటున్నాయని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి శ్రీవాస్తవ్ వ్యాఖ్యానించారు. సరిహద్దు విషయంలో ఎంత బాధ్యతగా వ్యవహరించాలో తమకు తెలుసని, భారత సౌర్యభౌమాధికారం, భద్రతకు బలంగా కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. సిక్కిం వెంబడి ఉన్న సరిహద్దును దాటి భారత బలగాలు తమ భూభాగంలో చొచ్చుకొచ్చాయంటూ చైనా చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ ఖండించింది. లడఖ్‌, సిక్కిం సరిహద్దుల్లో భారత్‌, చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ వద్ద ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో శ్రీవాస్తవ గురువారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. ఎల్‌ఏసీ వెంబడి పశ్చిమ, సిక్కిం సెక్టార్‌లలో భారత సైన్యం ఎలాంటి కార్యకలాపాలు చేపట్టలేదని ఆయన పేర్కొన్నారు. చైనాతో సరిహద్దులకు సంబంధించిన విషయంలో భారత బలగాలకు పూర్తి అవగాహన ఉందని, దానికి వారు కట్టుబడి ఉన్నారని ఉద్ఘాటించారు. కానీ, చైనా మాత్రం తమ సైన్యం చేపట్టే సాధారణ పెట్రోలింగ్‌కు ఆటంకం కలిగిస్తోందని దుయ్యబట్టారు. భారత్‌ మాత్రం సరిహద్దు విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తోందని, అలాగే దేశ సార్వభౌమాధికారానికి, భదత్రకు కట్టుబడి ఉన్నామన్నారు. ఎల్‌ఐసి వద్ద ఏదైనా వివాదం తలెత్తితే దానిని పరిష్కరించడానికి భారత దళాలు వివిధ ద్వైపాక్షిక ఒప్పందాలు, ప్రోటోకాల్‌లలో పేర్కొన్న విధానాలను ఖచ్చితంగా అనుసరిస్తాయన్నారు. ఇటువంటి పరిస్థితులను చర్చల ద్వారా శాంతియుతంగా పరిష్కరించడానికి ఇరువర్గాలు యంత్రాంగాలను ఏర్పాటు చేసిన విషయం గుర్తుచేశారు. లడఖ్‌లో సరిహద్దులను మార్చేందుకు భారత్‌ ప్రయత్నిస్తోందని చైనా విదేశాంగ శాఖ ఆరోపించింది. తక్షణమే సరిహద్దులోని సైన్యాన్ని భారత్ ఉపసంహరించుకుని, యథాతథ స్థితిని పునరుద్ధరించాలని చైనా పేర్కొంది. సరిహద్దుల విషయంలో ఇరు దేశాధినేతల మధ్య కుదిరిన ఏకాభిప్రాయం, ఒప్పందాలను గౌరవించాలంటూ ఓ ప్రకటన విడుదల చేసింది. సైన్యాన్ని ఉపసంహరించి, సరిహద్దుల్లో సంయుక్తంగా శాంతి, స్థిరత్వాన్ని కాపాడాలని వ్యాఖ్యానించింది. దీనిపై భారత్ గురువారం ధీటుగానే బదులిచ్చింది. ‘సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, ప్రశాంతతను కొనసాగించడం భారత-చైనా ద్వైపాక్షిక సంబంధాల మరింత అభివృద్ధికి అవసరం’ చైనాకు గుర్తు చేసింది. భారత ప్రకటనను చైనా ఓ హెచ్చరికగా చూడాలని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, మే మొదటి వారంలో తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద రెండు దేశాలకు చెందిన దాదాపు 250 మంది సైనికులు బాహాబాహీకి దిగి, పరస్పరం పిడిగుద్దులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ అంశంపై ఇరు పక్షాలకు చెందిన స్థానిక కమాండర్లు సమావేశమై చర్చించడంతో వివాదం సద్దుమణిగింది. ఇదే సమయంలో ఈ ప్రాంతానికి చేరువలోకి చైనా సైనిక హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. దీనికి తీవ్రంగా స్పందించిన భారత్.. వైమానిక దళానికి చెందిన సుఖోయ్‌-30 యుద్ధ విమానాలను పంపి గస్తీ చేపట్టింది. లడఖ్‌ సరిహద్దులను దాటి కొన్ని కిలోమీటర్ల మేర భారత భూభాగంలో చైనా దళాలు చొచ్చుకొచ్చినట్టు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. గల్వాన్ నది, పాంగాంగ్ సరస్సు సమీపంలోని నాలుగుచోట్ల చైనా సైన్యం గుడారాలు వేసుకుని, పలు నిర్మాణాలు ప్రారంభించినట్టు తెలిపాయి.


By May 22, 2020 at 07:17AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/a-day-after-china-accused-india-of-crossing-the-lac-india-pushed-back-firmly/articleshow/75880795.cms

No comments