Breaking News

లాక్‌డౌన్ ఉల్లంఘించి గోవా బీచ్‌లో రష్యా టీనేజర్లు మందు, విందు


లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి గోవా బీచ్‌లో పార్టీ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీరిలో కొంతమంది అమ్మాయిలు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ఆదివారం అశ్వమే బీచ్‌లోని ఓ ప్రాంతంలో రష్యా టీనేజర్లు మద్యం సేవించి, పార్టీ చేసుకున్నారని గోవా పోలీసులు మంగళవారం వెల్లడించారు. లాక్‌డౌన్, ప్రభుత్వం నిబంధనలు ఉల్లంఘించిన వీరిని అరెస్ట్ చేశామని పేర్కొన్నారు. రష్యా టీనేజర్లను పెర్‌నెమ్ పోలీసులు అరెస్ట్ చేశారని, వారి పోస్‌పోర్ట్‌లను స్వాధీనం చేసుకున్నారని మపాసు డీఎస్పీ గజానన్ ప్రభుదేశాయ్ తెలియజేశారు. వీరిలో కొందరు అమ్మాయిలు కూడా ఉన్నారని, అందరిపై కేసు నమోదుచేశామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడంతోపాటు లాక్‌డౌన్ నిబంధనల ఉల్లంఘన కింద కేసులు నమోదుచేసినట్టు తెలిపారు. అందరూ మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందుంచామని వివరించారు. అనంతరం జువైనల్ హోమ్‌కి తరలించామని తెలియజేశారు. వీరి అరెస్ట్ గురించి భారత్‌లోని రష్యా రాయబార కార్యాలయానికి కూడా సమాచారం అందజేయనున్నామని డీఎస్పీ పేర్కొన్నారు. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించి పార్టీ చేసుకోవడం, బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించిన రష్యా పౌరులను పోలీసులు అరెస్ట్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దేశంలోనే తొలి కరోనా రహిత రాష్ట్రంగా గుర్తింపు పొందిన గోవాలో మళ్లీ పాజిటివ్ కేసులు నమోదవుతున్న విషయం తెలిసిందే. కరోనా నుంచి పూర్తిగా విముక్తి పొంది, గ్రీన్ జోన్‌లోకి ఇటీవలే చేరిన‌ గోవాలో గత బుధవారం ర్యాపిడ్ టెస్టుల‌ు నిర్వహించగా.. ఏడుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరంతా ముంబై నుంచి వచ్చినవారు కాగా.. ప్రస్తుతం క్వారంటైన్‌లో ఉంచినట్టు ఆరోగ్య మంత్రి విశ్వజీత్ రాణే తెలిపారు. అలాగే, ముంబై నుంచి గోవాకు ప్రత్యేక రైలులో వచ్చిన ప్రయాణికుల్లో నలుగురికి కరోనా వైరస్ సోకడం సంచలనం రేపింది. 100 మంది గోవా వాసులను ప్రత్యేక రైలులో గోవాకు తీసుకువచ్చారు. వీరికి ట్రూనాట్ పద్ధతిలో కరోనా పరీక్షలు చేయగా వారిలో నలుగురికి కరోనా వైరస్ సోకిందని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 26కి చేరింది.


By May 20, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/russian-teenagers-found-partying-on-goa-beach-amid-lockdown-detained-by-police/articleshow/75839726.cms

No comments