Breaking News

షార్ట్ సర్క్యూట్‌తో ఏసీలో మంటలు.. బీజేడీ నేత సహా ముగ్గురు మృతి


షార్ట్ సర్క్యూట్ కారణంగా గదిలోని ఎయిర్ కండిషనర్‌లో మంటలు వ్యాపించి అధికార పార్టీ నేత సహా ముగ్గురు చనిపోయిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. ఈ ఘటన గంజాం జిల్లాలోని గోషనిన్‌గావ్‌లో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. (69) నిద్రిస్తున్న గదిలోని ఏసీలో షార్ట్ సర్క్యూట్ వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగి వ్యాపించాయి. దీంతో ఆలేఖ్ చౌదరి, ఆయన బావమరిది, బంధువు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల కథనం ప్రకారం.. అలేఖ్ చౌదరి నిద్రిస్తున్న గదిలోని ఏసీలో మంటలు చెలరేగాయి. మంటలను గమనించిన అలేఖ్ చౌదరి వెంటనే అప్రమత్తమై కుటుంబ సభ్యులను నిద్రలేపి బయటకు పంపేశారు. అనంతరం అదే గదిలో నిద్రపోతున్న బావమరిది భగవాన్ పాత్రో, బంధువు సునీల్ బెహరాను కాపాడేందుకు వెళ్లారు. వారిని కాపాడటానికి వెళ్లిన ఆయన ఊపిరి ఆడక గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. చౌదరి ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో అగ్నిమాపక సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న పోలీసులు.. మంటలను అదుపు చేసి గదిలో అపస్మారక స్థితిలో పడి ఉన్న వారిని బరంపురంలోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌కి తరలించారు. అయితే, అప్పటికే వారు ముగ్గురు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. అలేఖ్ చౌదరి మరణ వార్త తెలియడంతో పలు పార్టీలకు చెందిన నేతలు హాస్పిటల్‌కు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఆయన మృతిపై అధికార పార్టీ ఎమ్మెల్యేలు సంతాపం తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలేఖ్ చౌదరి గతంలో బరంపురం సెంట్రల్ కో-ఆపరేటివ్ బ్యాంక్ అధ్యక్షుడిగా పనిచేశారు. గంజాం జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అలాగే, బరంపురం, అస్కా అసెంబ్లీ స్థానాలకు కాంగ్రెస్ టిక్కెట్‌, స్వతంత్ర అభ్యర్థిగా పలుసార్లు పోటీచేసి ఓడిపోయారు. అనంతరం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన అలేఖ్.. 2014 ఎన్నికల ముందు బీజేడీలో చేరారు.


By May 30, 2020 at 10:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjd-leader-alekh-choudhury-mong-three-killed-in-fire-in-odishas-ganjam/articleshow/76102879.cms

No comments