Breaking News

మోదీతో ట్రంప్ మాట్లాడలేదు.. ఏప్రిల్ 4నే చివరిసారిగా సంభాషణ: ప్రభుత్వ వర్గాలు


చైనాతో సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడానని, ఆయన మూడు అంత బాగోలేదని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యాఖ్యలను ప్రభుత్వ వర్గాలు తోసిపుచ్చాయి. అమెరికా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల కాలంలో మాట్లాడలేదని పేర్కొన్నాయి. ఏప్రిల్ 4న చివరిసారిగా హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధం గురించి మాత్రమే ఇరువురూ మాట్లాడుకున్నట్టు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. సరిహద్దుల్లో వివాదం గురించి చైనాతో దౌత్యపరమైన చర్చలు కొనసాగుతున్నాయని భారత విదేశాంగ శాఖ బుధవారం స్పష్టం చేసిన విషయాన్ని అధికార వర్గాలు గుర్తుచేశాయి. మరోవైపు, చైనా సైతం ద్వైపాక్షిక చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుంటామని పేర్కొంది. ఇందులో మరొకరి జోక్యం అవసరంలేదని స్పష్టం చేసింది. భారత్, చైనాలు సంయమనం పాటిస్తున్నాయని, వివాదాన్ని పరిష్కరించుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని భారత్‌లో చైనా రాయబారి సన్ వీడాంగ్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, తమ మధ్య విభేదాలను పరస్పర చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని, ద్వైపాక్షిక విధానంలోకి ఇతరులను ఎప్పుడూ అనుమతించబోమని అన్నారు. ‘భారత్, చైనాల మధ్య పెద్ద సంఘర్షణ నెలకుంది.. ఇరు దేశాల్లోనూ ఒక్కొక్కరికి 1.4 బిలియన్ల జనాభా ఉంది... ఇరువురికీ శక్తివంతమైన సైనిక సామర్థ్యం కూడా ఉంది.. భారత్ సంతోషంగా లేకపోతే చైనా కూడా సంతోషంగా ఉండదు’ అని అన్నారు. భారత్, చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలపై తాను ఆందోళన చెందుతున్నానని ట్రంప్ తెలిపారు. ‘నేను మీకు చెప్పగలను.. నేను ప్రధాని మోదీతో మాట్లాడాను. చైనాతో ఏం జరుగుతుందో.. ఆయన మంచి మూడ్‌లో’ లేరు అని పేర్కొన్నారు. మే నెల ప్రారంభంలో భారత్‌, చైనా సరిహద్దుల్లో ఇరు సైన్యాలు బాహాబాహీ దిగి, ఒకరిపై ఒకరు దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఏర్పడిన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. తూర్పు లడఖ్ ప్రాంతంలో భారత్, చైనాలు తమ బలగాలను మోహరించాయి. ఈ ప్రాంతంలో ఇరు దేశాల మధ్య వివాదం కొనసాగుతోంది. సైనిక బలగాల మోహరింపుతో మరోసారి ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. దెమ్‌చోక్, చుమార్, దౌలత్ బేగ్ ఓల్డై, గాల్వాన్ లోయ వద్ద బలగాలను మోహరించాయి. తొలుత చైనా సైన్యం ఓ నది వద్ద గుడారాలు వేసి, నిర్మాణాలు ప్రారంభించడంతో గాల్వాన్ లోయ వద్ద భారత్ సైన్యాన్ని మోహరించింది.


By May 29, 2020 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/no-recent-contact-between-pm-modi-us-president-donald-trump-say-government-sources/articleshow/76084284.cms

No comments