Breaking News

వలస కార్మికుల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం.. 41 ఏళ్ల తర్వాత మళ్లీ!


లాక్‌డౌన్ వల్ల దేశవ్యాప్తంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేతిలో పనిలేక.. తినడానికి పట్టెడు అన్నం కూడా దొరక్క వేలాది మంది వందల కిలోమీటర్ల దూరంలోని తమ సొంతూళ్లకు కాలినడకన పయనమైన ఘటనలు కోకొల్లలుగా దర్శనమిస్తున్నాయి. దేశవ్యాప్తంగా వలస కార్మికులు తీవ్ర సంక్షోభం ఎదుర్కొంటున్నారు. ఈ సంక్షోభం నుంచి కేంద్రం పాఠాలు నేర్చుకునే ప్రయత్నాలు ప్రారంభించింది. దీంతో 41 సంవత్సరాల తర్వాత వలస కార్మికులను పునర్నిర్వచించడానికి సిద్ధమైంది. వీరికి కార్మిక రాజ్య బీమా కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కింద సామాజిక భద్రత, ఆరోగ్య ప్రయోజనాలను అందజేయడానికి వీలుగా పేర్లను నమోదు చేయాలని యోచిస్తోంది. లాక్‌డౌన్ సమయంలో అనధికారిక, అధికారిక ఆర్థిక వ్యవస్థలో లక్షలాది మంది కార్మికుల పెద్ద ఎత్తున వలసలను అనుసరించే కొత్త చర్యలు, సామాజిక భద్రత కోడ్ కోడ్ కింద ప్రతిపాదించింది. కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనలపై కేంద్ర మంత్రివర్గం త్వరలో నిర్ణయం తీసుకోనుంది. ఈ ఏడాది చివరి నాటికి దీనికి సంబంధించిన చట్టాన్ని రూపొందించాలని కేంద్రం యోచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర కార్మిక మంత్రి సంతోష్ గంగ్వార్ ధ్రువీకరించారు. లీగల్ ఫ్రేమ్ వర్క్ బలోపేతం చేస్తున్నామని, బీజేడీ ఎంపీ భతృహరి మహతాబ్ నేతృత్వంలోని పార్లమెంటు స్టాండింగ్ కమిటీ క్లియర్ చేసిన ప్రతిపాదిత కోడ్‌లో కొన్ని నిబంధనల్లో మరిన్ని మార్పులు చేస్తామని తెలిపారు. ప్రస్తుత చట్టపరమైన ఫ్రేమ్ వర్క్ సరిపోనందున ఈ దశలు కీలకమైనవిగా భావిస్తున్నారు. లాక్‌డౌన్ వల్ల వలసజీవుల కష్టాలు బహిర్గతం కావడం, ఎలాంటి ఉపాధి రికార్డులు లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రమైన పునరాలోచనలో పడేసింది. ఇంటర్-స్టేట్ మైగ్రెంట్ వర్క్‌మెన్ యాక్ట్ 1979.. ఐదు లేదా అంతకంటే ఎక్కువ మంది వల కార్మికులతో ఉన్న సంస్థలు, వారి నియామకంలో పాల్గొన్న కాంట్రాక్టర్లకు వర్తిస్తుంది. అంటే చాలా మంది వలస కార్మికులు చట్టం పరిమితికి వెలుపల ఉంటారని దీని అర్థం అని ఒక అధికారి వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత ముసాయిదా చట్టం వ్యక్తిగత వలస కార్మికులకు వర్తిస్తుంది.. ఫ్రేమ్‌వర్క్‌లో చేర్చిన నిబంధనల ప్రకారం ఇళ్లలో పనిచేసేవారు సైతం నిర్దిష్ట మొత్తాన్ని అందుకోవచ్చు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా నిర్దేశిత వేతనం లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఒకే విధమైన ప్రయోజనాలు పొందుతారు.. ఏటా ఒకసారి ఇంటికి వెళ్లే ఛార్జీలను సైతం పొందడానికి అర్హులని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అసంఘటిత రంగ కార్మికులకు అన్-రికగ్నైజ్‌డ్ వర్కర్ ఐడెంటిఫికేషన్ నంబర్ (యు-విన్)ను కేటాయించడం ఈ ప్రణాళిక ముఖ్య అంశం. దీనిపై 2008లో ఒక చట్టం తీసుకొచ్చినా అంతగా ముందుకు సాగలేదు. పెన్షన్, హెల్త్‌కేర్ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను కల్పించి, కార్మికుల పేర్లను నమోదు చేసుకునేలా కేంద్రం ముసాయిదా రూపొందించింది. ఆధార్-లింక్డ్ జాతీయ డేటాబేస్ ద్వారా దీనిని సృష్టించాలని ప్రతిపాదించారు. కేంద్రం, రాష్ట్రాలు భాగస్వామ్యం ఉండేలా కీలక నిబంధనలు ఉంటాయని, రికార్డు సృష్టిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపాయి. అసంఘటిత రంగ కార్మికుల కోసం పెన్షన్ పథకం ఇప్పటికే అమలులో ఉండగా, నామమాత్రపు రుసుం చెల్లించి ఈఎస్ఐలో చేరేందుకు వారిని అనుమతించడం ఒక ముఖ్య అంశం అని అధికారులు తెలిపారు. ప్రమాదకర యూనిట్‌లు,తోటలలో పనిచేసే వారికి కూడా ఈ ప్రయోజనం విస్తరించవచ్చు. ఏదేమైనా జిల్లాల్లోని లబ్ధిదారులకు ఆరోగ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ పరిధిని విస్తరిస్తున్నారు.


By May 28, 2020 at 08:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/after-41-years-central-government-set-to-redefine-migrant-workers/articleshow/76056265.cms

No comments