Breaking News

లాక్‌డౌన్ కొనసాగినా మరిన్ని వెసులుబాట్లు.. ఆ 13 నగరాల్లోనే మరింత కఠినంగా!


కరోనా వైరస్ మహమ్మారిని నియంత్రించడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్‌-4.0 ఆదివారంతో ముగియనుండటంతో భవిష్యత్తు కార్యాచరణపై కసరత్తులను కేంద్రం ముమ్మరం చేసింది. కరోనాకు కళ్లెం వేస్తూనే, దేశ ఆర్థిక వ్యవస్థను పరిరక్షించుకునేందుకు ఏం చేయాలనేదానిపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, పలువురు సీనియర్‌ అధికారులతో శుక్రవారం సమావేశమై చర్చించారు. గురువారం నాడు పలువురు ముఖ్యమంత్రులతో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి.. లాక్‌డౌన్‌పై వారు వెళ్లడించిన అభిప్రాయాలను ప్రధానికి వివరించారు. కొవిడ్‌ వ్యవహారాల పర్యవేక్షణకు ఏర్పాటుచేసిన రెండు కమిటీలు లాక్‌డౌన్‌ను మరింత సరళతరం చేయాలని సూచించిన నేపథ్యంలో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుంటుందనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. వైరస్‌ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నియంత్రణ చర్యలు కఠినంగా చేపడుతూనే, ఇతర ప్రాంతాలలో ఆంక్షలను తొలిగించాలని కేంద్రం ఏర్పాటుచేసిన కమిటీలు అభిప్రాయపడుతున్నాయి. విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు, ప్రార్థనా స్థలాలు మినహా అన్నింటిపై ఆంక్షలు ఎత్తేయాలని అవి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో రోజూ 7 వేలకుపైగా కేసులు నమోదు కావడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందా? లేదంటే కరోనా ఉద్ధృతి ఒక్కో రాష్ట్రంలో ఒక్కోవిధంగా ఉంది కాబట్టి నియంత్రణ చర్యలను రాష్ట్రాలకే వదిలేస్తుందా? అనే ఉత్కంఠ నెలకుంది. లాక్‌డౌన్‌ను కొనసాగించినా.. మరిన్ని వెసులుబాట్లు కల్పించే అవకాశముందని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. మెట్రో రైలు సర్వీసులు, మాల్స్, జిమ్స్ వంటివి ప్రారంభించే అవకాశం ఉంది. కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి రాజీవ్‌ గౌబా పలు రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులతో గురువారం మాట్లాడి, కేసుల ఉద్ధృతి అధికంగా ఉన్న 13 నగరాలపై ప్రధానంగా దృష్టిసారించాలని ఆదేశించారు. కంటెయిన్‌మెంట్ జోన్‌లలో ఆంక్షలను కఠినంగా అమలు చేయాలని సూచించారు. తొలి విడత లాక్‌డౌన్‌‌లో ఎలాంటి మినహాయింపులు లేకుండా 21 రోజులు కొనసాగించారు. తర్వాతి దశల్లో నిబంధనలను క్రమంగా సడలించుకుంటూ వచ్చిన కేంద్రం ప్రస్తుతం మినహాయింపులను మరింత విస్తృతం చేసే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విమానాలు, రైలు సర్వీసులు పునః ప్రారంభం కావడంతోపాటు చాలా రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు కూడా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇకపై లాక్‌డౌన్‌ను కొనసాగించినా ఆంక్షలను కొన్ని రంగాలకే పరిమితం చేయొచ్చని తెలుస్తోంది. గతంలో లాక్‌డౌన్‌ ముగింపునకు వచ్చిన ప్రతిసారి ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ స్వయంగా మాట్లాడారు. ఈసారి మాత్రం ఆ అవకాశం అమిత్‌ షా‌కు ఇచ్చారు. లాక్‌డౌన్‌ కొనసాగింపుపై సీఎంల అభిప్రాయాలను తెలుసుకున్న షా... జూన్ 1 నుంచి ఏయే రంగాలకు ఆంక్షల నుంచి మినహాయింపులు కోరుకుంటున్నారో ఆరా తీశారు. ఆ వివరాలన్నింటినీ తాజా భేటీలో మోదీకి తెలియజేశారు. వీటి ఆధారంగా కేంద్రం తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశముంది. ఆదివారం జరిగే మన్‌-కీ-బాత్‌‌లో ప్రధాని దీనిపై స్పష్టత ఇస్తారనే ప్రచారం సాగుతోంది.


By May 30, 2020 at 08:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-narendra-modi-home-minister-amit-shah-discuss-lockdown-curbs-may-be-eased-further/articleshow/76101820.cms

No comments