Breaking News

పిడుగు పడి నవ వరుడుతో సహా ఐదుగురు మృతి


ఈశాన్య విదర్భ పరిసరాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఏపీ, తెలంగాణతో పాటు.. పక్కనే ఉన్న తమిళనాడులో కూడా వానలు పడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామున ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసింది. ఆ రాష్ట్రంలో పిడుగుపాటుకు ప్లస్ వన్ విద్యార్థినితో పాటు ఐదుగురు మృతి చెందారు. ఉదయం ప్రారంభమైన భారీ వర్షం ఉదయం 8 గంటల వరకు కురిసింది. కాంచీపురంలో ఉదయం వాకింగ్‌కు వెళ్లిన నవ వరుడు పిడుగుపాటుకు గురై మృతిచెందాడు. తిరువళ్లూర్‌ జిల్లా నేమలూరులో రైతు చంద్రన్‌, తిరువణ్ణామలై జిల్లా సెయ్యారు నదిలో చేపలు పడుతు న్న ఆనందన్‌, రాణిపేట జిల్లాలో పొలానికి వెళుతున్న ప్లస్‌ వన్‌ విద్యార్థిని మహాలక్ష్మిలు పిడుగుపాటుకు గురై మృతిచెందారు. అలాగే, నామక్కల్‌ జిల్లా పరమత్తివేలూరులో పెరుమాళ్‌ అనే వ్యక్తిపై కొబ్బరి చెట్లు విరిగి పడిన ఘటనలో అతడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. ఆదివారం ఏపీలో కూడా పిడుగుపాటుతో ఒకరు మృతి చెందారు. తూర్పు గోదావరి జిల్లాలో మూడేళ్ల చిన్నారి పిడుగు పడి మృతి చెందింది. మరోవైపు ఏపీకి కూడా భారీ వర్ష సూచన ఉందని తెలిపింది వాతావరణ శాఖ. ఆంధ్రప్రదేశ్‌లో రాగల 48 గంటల్లో ఉరుములు, మెరుపులతో, ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా విశాఖపట్నం, తూర్పుగోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు పడవచ్చని వాతావరణ కేంద్రం డైరెక్టర్ స్టెల్లా వెల్లడించారు. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు.


By April 27, 2020 at 08:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-killed-in-heavy-rains-at-tamilnadu/articleshow/75398955.cms

No comments