Breaking News

మార్చి 23 వరకు ఢిల్లీ నుంచి ఏపీ, తెలంగాణకు 2.20 లక్షల మంది.. రైల్వే వెల్లడి


దేశంలో కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడానికి ఢిల్లీలోని నిజాముద్దీన మర్కజ్ ప్రార్థనలు కారణమయ్యాయి. మార్చి 1 నుంచి 15 వరకు జరిగిన సమ్మేళనానికి దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున హాజరయ్యారు. గడచిన నాలుగు రోజుల్లో దాదాపు 2,000 కేసులు నమోదుకాగా, 70 శాతం మంది వీరే ఉన్నారు. ఢిల్లీ జమాత్ ప్రార్థనలకు వెళ్లివచ్చినవారితోనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ‌లో కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి. అయితే, ఈ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిలో కొంత మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. దీంతో మరింత ఆందోళన మొదలైంది. కోవిడ్-19 పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున వారిని పూర్తిస్థాయిలో గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసులు, రెవెన్యూ యంత్రాంగం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ నుంచి రైళ్లలో తెలుగు రాష్ట్రాలకు వచ్చినవారి జాబితాను దక్షిణ మధ్య రైల్వే అందజేసింది. తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొనవారిని గుర్తించడానికి ప్రస్తుతం ఈ జాబితా కీలకంగా మారింది. మర్కజ్‌ సమ్మేళనం మార్చి 1 నుంచి 15 వరకు జరిగింది. ఈ నేపథ్యంలో మార్చి 11 నుంచి 23 వరకు ఢిల్లీ నుంచి వచ్చిన అన్ని రైళ్ల సమాచారం కావాలని దక్షిణ మధ్య రైల్వేను తెలుగు రాష్ట్రాల అధికారులు కోరారు. దీంతో ఆ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు వచ్చిన 2.20 లక్షల మంది పేర్లు, సెల్‌ నంబర్‌, చిరునామాలను సెంటర్‌ ఫర్‌ రైల్వే ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్‌ (క్రిస్‌) అధికారులు అందజేశారు. తెలంగాణ, ఏపీ పరిధిలోని రైల్వే స్టేషన్లలో దిగిన ప్రయాణికుల వివరాలను రాష్ట్ర ప్రభుత్వాలకు అందించారు. అలాగే, ముంబయి, పుణె, నాగ్‌పూర్‌ తదితర స్టేషన్లలో దిగిన ప్రయాణికుల సమాచారాన్ని కూడా మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు రైల్వే అధికారులు తెలిపారు. కాగా రైల్వేశాఖ అందించిన జాబితా ఆధారంగా ఇప్పటివరకు క్వారంటైన్‌లోకి వెళ్లని వారిని గుర్తించే పనిని ముమ్మరం చేసినట్లు తెలంగాణకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. అయితే, తబ్లీగ్ జమాత్‌కు వెళ్లొచ్చినవారిలో ఎంతమంది దొరకలేదన్న విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. తెలంగాణ నుంచి మొత్తం 1,030 మంది తబ్లిగీ జమాత్‌ కార్యక్రమానికి వెళ్లి రాగా వారిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 603 మంది, జిల్లాలకు చెందిన వారు 427 మంది ఉన్నారు. జిల్లాల వారిలో కరోనా లక్షణాలు ఉన్న వారిని చికిత్సకు, లేనివారిని క్వారంటైన్‌కు తరలించారు. హైదరాబాద్‌ చుట్టుపక్కల మాత్రం మిగిలిపోయిన వారి కోసం గాలింపు జరుగుతూనే ఉంది. ఏపీలోనూ దాదాపు 1,000 మంది ఢిల్లీకి వెళ్లొచ్చారు.


By April 05, 2020 at 10:03AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-2-lakh-travellers-coming-from-delhi-to-ap-and-telangana-on-march-11th-to-23rd/articleshow/74989931.cms

No comments