Breaking News

దేశంలో 2వేల మార్క్ దాటిన కరోనా కేసులు.. 59 మంది మృతి


దేశంలో మహమ్మారి తీవ్రత రోజు రోజుకూ మరింత ఉద్ధృతమవుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా దాదాపు 400 కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా వైరస్ కేసులు వెలుగుచూసిన తర్వాత మంగళవారం నాడు అత్యధికంగా 300పైగా కేసులు నమోదు కాగా.. బుధవారం ఆ సంఖ్యకు మించి నిర్ధారణ అయ్యాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి సోకే స్థాయిని దాటి సామాజిక వ్యాప్తి మొదలైందని పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. గత రెండు రోజులు దేశంలో వెలుగుచూస్తున్న కేసుల్లో 95 శాతం మంది ఢిల్లీలో తబ్లీగ్ జమాత్ ప్రార్థనల్లో పాల్గొన్న వివిధ రాష్ట్రాలవారు ఉన్నారు. మరోవైపు, దేశంలో వైరస్ కేసులకు 10 ప్రాంతాలు హాట్‌స్పాట్‌లుగా ఉన్నాయని కేంద్రం ప్రకటించింది. ఎక్కువ కేసులు ఆ రాష్ట్రాల్లోని ప్రాంతాల్లోనే నమోదవుతున్నట్టు తెలిపింది. నిజాముద్దీన్ మర్కజ్ భవన్‌లో తబ్లీగ్ జమాత్ ప్రార్థనలకు హాజరైన ప్రతినిధులు వల్లే వైరస్ వ్యాప్తి ఒక్కసారిగా పెరిగినట్టు నిర్ధారణ కావడంతో వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటి వరకు 6,000 మందిని గుర్తించి, 5,000 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 2,000 దాటింది. గడచిన మూడు రోజుల్లోనే కొత్తగా 1,000 వరకు కరోనా కేసులు నమోదుకావడం గమనార్హం. ఇప్పటి వరకు కరోనా వైరస్ బాధితుల్లో 59 మంది మృత్యువాత పడ్డారు. సోమవారం వరకు దేశంలో పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. తబ్లీగ్ జమాత్ వ్యవహారంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బుధవారం దాదాపు 400 మందిలో వైరస్ నిర్ధారణ అయ్యింది. వీరిలో తబ్లిగ్ జమాత్ ప్రార్థనలకు హాజరైనవారే అధికం. అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క రోజే 67 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో కోవిడ్-19 కేసుల సంఖ్య 111కి చేరింది. తమిళనాడు, మహారాష్ట్ర, కేరళ, ఢిల్లీ, రాజస్థాన్‌లోనూ బుధవారం పెద్ద సంఖ్యలో కేసులు బయటపడ్డాయి. తెలంగాణలో బుధవారం ఒక్క రోజే 30 కరోనా కేసులు నమోదు కాగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, యశోదలో ఒకరు చనిపోయారని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకూ కోవిడ్ బారిన పడి చనిపోయిన వారి సంఖ్య రాష్ట్రంలో 9కి చేరింది. దీంతో కలిపి తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 127కు చేరింది. వీరిలో 14 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గాంధీలో చనిపోయిన కరోనా పేషెంట్ మృతదేహాన్ని తీసుకెళ్లనీయలేదని అతడి బంధువులు గాంధీ హాస్పిటల్‌‌లో డాక్టర్లపై దాడికి దిగారు. ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం రాత్రి మరో 24 మందికి కరోనా పాజిటివ్ అని తేలిందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో రాష్ట్రంలో కోవిడ్ బారిన పడిన వారి సంఖ్య 111కు చేరింది. బుధవారం సాయంత్రం 7 గంటలకు ల్యాబ్ ఫలితాలు వచ్చిన తర్వాత ఏపీ ప్రభుత్వం హెల్త్ బులెటిన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఏపీ ప్రభుత్వం వెల్లడించిన వివరాల ప్రకారం గుంటూరు జిల్లాలో అత్యధికంగా 20 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాలో 15 మందికి చొప్పున కరోనా సోకింది. పశ్చిమ గోదావరిలో 14 మందకి, విశాఖ జిల్లాలో 11 మందికి, తూర్పు గోదావరిలో 9 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దేశంలోనే అత్యధికంగా మహారాష్ట్రలో 332 కేసులు నమోదయ్యాయి. దీని తర్వాత స్థానాల్లో కేరళ, తమిళనాడు, ఢిల్లీ, రాజస్థాన్ ఉన్నాయి. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 59 మృతిచెందారు. అత్యధికంగా మహారాష్ట్రలో 14 మంది, తెలంగాణలో 9, గుజరాత్‌, మధ్యప్రదేశ్, పశ్చిమ్ బెంగాల్‌లో ఆరుగురు చొప్పున, పంజాబ్ 4, కర్ణాటక 3, జమ్మూ కశ్మీర్, ఢిల్లీ 2, మిగతా రాష్ట్రాల్లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 169 మంది బాధితులు కోలుకున్నారు. మహారాష్ట్రలో 332, కేరళలో 265, తమిళనాడు 234, ఢిల్లీలో 152, తెలంగాణ 127, రాజస్థాన్ 120, ఉత్తరప్రదేశ్‌లో 117, ఆంధ్రప్రదేశ్ 111, కర్ణాటకలో 110, గుజరాత్ 87, మధ్యప్రదేశ్ 86, జమ్మూ కశ్మీర్ 62, పంజాబ్ 42, హర్యానా 43, పశ్చిమ్ బెంగాల్ 37, బీహార్ 24, చండీగఢ్ 17, అసోం 13, లడఖ్ 13 మిగతా రాష్ట్రాల్లో 10లోపు కేసులు నమోదయ్యాయి.


By April 02, 2020 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-india-crosses-2000-more-than-55-died-across-country/articleshow/74940898.cms

No comments