Breaking News

దేశంలో కరోనా వైరస్.. ప్రతి 10 లక్షల మందిలో 3.8 మందికి వ్యాధి


ప్రపంచంలోని 200కుపైగా దేశాల్లో వ్యాపించిన కోవిడ్ -19 మహమ్మారి కట్టడికి సామాజిక దూరం, లాక్‌డౌన్ శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్లు అని కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ హర్ష్‌వర్ధన్ అన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకి చెందిన బెన్నెట్ యూనివర్సిటీ టైమ్స్ స్కూల్ ఆఫ్ మీడియా గురువారం నిర్వహించిన కోవిడ్-19పై అంతర్జాతీయ ఆన్‌లైన్ కాన్ఫరెన్స్‌లో కేంద్ర మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలోని 133 హాట్‌స్పాట్ జిల్లాలపై దృష్టి సారించి, సమగ్ర వ్యూహంతో ముందుకెళ్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. సామాజిక దూరం, వీలైనంత మేర ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉండటమే ఉత్తమని తెలిపారు. గణాంకాల ఆధారంగా మహమ్మారిని కట్టడిచేయడంలో ఇతర దేశాల కంటే భారత్ మెరుగ్గా ఉందని తాను చెప్పగలనని హర్షవర్దన్ వివరించారు. అంతేకాదు, దేశంలో రేటు ప్రతి పది లక్షల మందిలో 3.8 శాతంగా ఉందని స్పష్టం చేశారు. ఇతర దేశాల్లో దీని తీవ్రత అత్యధికంగా ఉందని ఆయన వివరించారు. కోవిడ్-19కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకూ సామాజిక దూరం పాటించడం వల్ల ఒక వ్యక్తి ప్రాణాలను రక్షించగలదని, ఇదే శక్తివంతమైన సామాజిక వ్యాక్సిన్ అని ఉద్ఘాటించారు. దేశంలో కరోనా వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న 133 జిల్లాల్లోని ప్రాంతాలను కంటెయిన్‌మెంట్ జోన్‌లుగా విభజించి, కట్టడికి పటిష్ఠ చర్యలు చేపట్టామని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాంతాల్లో వైరస్‌ వ్యాప్తి ముప్పు ఎక్కువగా ఉందని, దీనిని నియంత్రించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని అన్నారు. హాట్‌స్పాట్‌లపై కీలకంగా దృష్టి కేంద్రీకరించి, ఈ ప్రాంతాల్లోని ఏడు లక్షలకుపైగా ప్రజలపై సమర్థవంతమైన పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. తమ ప్రాణాలను ఫణంగా పెట్టి మహమ్మారితో పోరాడుతున్న వైద్య సిబ్బందికి దేశం యావత్తు మద్దతుగా నిలవాలని కేంద్ర మంత్రి అభ్యర్థించారు. ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులు, నర్సుల పట్ల దురుసుగా ప్రవర్తించేవారు, దాడి చేసేవారు సిగ్గుతో తలదించుకోవాలని, ఇలాంటి సంఘటనలు చోటుచేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలను దేశ ప్రజలందరూ ఖండించాలని పిలుపునిచ్చారు. స్క్రీనింగ్ పరీక్షలు, కమ్యూనిటీ నిఘా, ఆశా కార్యకర్తల సామర్థ్యాన్ని పెంపొందించడం, ఆరోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం లాంటి విషయంలో ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టిందన్నారు. దీని వల్ల దేశంలో కరోనా వైరస్ తీవ్రత తగ్గిందని అన్నారు. అలాగే, ప్రయాణాలపై నిషేధం, పరీక్షలు, మాస్క్‌ల వినియోగం లాంటి వివిధ సూచనలు జారీచేశామని, ఈ సలహాలను ఎప్పటికప్పుడు సవరించుకుంటూ పరిస్థితులకు అనుగుణంగా వాటిని అప్‌గ్రేడ్ చేయాలన్నారు. దేశంతోపాటు ఇతర దేశాలలో జరుగుతున్న పరిణామాలు, అంశాలను నిశితంగా గమనిస్తున్నామని, ఈ పరిస్థితిని ప్రభుత్వం అత్యున్నత స్థాయిలో ప్రధాని, క్యాబినెట్ సెక్రెటరీతోపాటు తన నేతృత్వంలోని మంత్రుల బృందం క్రమం తప్పకుండా సమీక్షిస్తోందని కేంద్ర మంత్రి వివరించారు.


By April 10, 2020 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/at-3-8-cases-per-million-indias-rate-of-infection-still-fairly-low-says-union-health-minister/articleshow/75076996.cms

No comments