Breaking News

యెస్ బ్యాంక్ సంక్షోభం: మనీల్యాండరింగ్ కేసులో వ్యవస్థాపకుడు అరెస్ట్


పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయిన యెస్ బ్యాంక్ ఫౌండర్ రానా కపూర్‌ను మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ ఆదివారం తెల్లవారుజామున అరెస్టు చేసింది. దేవాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ సంస్థలో అక్రమ నగదు చలామణికి పాల్పడినట్టు పీఎంఎల్‌ చట్టం కింద ఆయనపై కేసు నమోదు చేశారు. యెస్ బ్యాంకులో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణల రావడంతో గత రెండు రోజులుగా రానా కపూర్‌ను అధికారులు విచారిస్తున్నారు. ముంబయిలోని వర్లీలోని నివాసం సముద్రాల రెసిడెన్సీలో శుక్రవారం సాయంత్రం ప్రాంరభమైన సోదాలు.. శనివారం కూడా కొనసాగాయి. విచారణ నిమిత్తం కార్యాలయానికి తరలించిన అధికారులు... దాదాపు 30 గంటల పాటు ప్రశ్నించారు. తర్వాత ఆదివారం వేకువజామున కపూర్‌ను అదుపులోకి తీసుకున్నారు. విచారణకు సహకరించని కారణంగానే ఆయనను అరెస్టు చేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయం 11 గంటలకు ఆయన్ని స్థానిక కోర్టు ప్రవేశపెట్టి కస్టడీకి కోరతామని పేర్కొన్నారు. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ సహా మరో కార్పొరేటు సంస్థకు ఇచ్చిన రుణాల విషయంలో కపూర్‌ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. యెస్ బ్యాంకు సంక్షోభంలో కూరుకుపోవడానికి దారితీసిన మరికొన్ని అవకతవకల్లోనూ ఆయన పాత్ర ఉన్నట్లు అనుమానిస్తున్నారు. తన ఇద్దరు కుమార్తెల పేరుతో నకిలీ కంపెనీ ప్రారంభించిన రూ.600 కోట్లు డీహెచ్ఎఫ్ఎల్ నుంచి తరిలించినట్టు గుర్తించారు. యెస్ బ్యాంకు మొత్తం రూ.4,450 కోట్ల రుణం మంజూరు చేయగా ఇందులో డీహెచ్ఎఫ్ఎల్‌కి రూ.3,700 కోట్లు, ఆర్కే‌డబ్ల్యూ డెవలపర్స్‌కి రూ.750 కోట్లు బదిలీచేశారు. అయితే, రుణాల సకాలంలో చెల్లించకపోయినా యెస్ బ్యాంకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. 79 షెల్ కంపెనీలు ఏర్పాటుచేసి మొత్తం రూ.13,000 కోట్లను మనీల్యాండరింగ్‌కు పాల్పడినట్టు ఈడీ అనుమానిస్తోంది. ఈ 4,450 కోట్లు కూడా అందులో భాగంగానే తరలించినట్టు భావిస్తోంది. మరోవైపు, యెస్‌ బ్యాంకు డెబిట్‌ కార్డుల ద్వారా యెస్‌ బ్యాంక్‌ సహా ఇతర ఏటీఎంలలో డబ్బులు విత్‌డ్రా చేసుకోవచ్చని ఆ బ్యాంక్‌ తన అధికారిక ట్విటర్ ఖాతాలో పేర్కొంది. గత మూడు రోజులుగా బ్యాంకు ఖాతాదారులు నగదు తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ సహా ఏటీఎంల నుంచి డబ్బులు తీసుకోవడానికి తీవ్ర ఇక్కట్లు పడ్డారు. యెస్‌ బ్యాంక్‌పై మారటోరియం విధిస్తూ.. విత్‌డ్రాలపై రూ.50వేల పరిమితిని విధించడంతో ఈ సమస్యలు తలెత్తాయి.


By March 08, 2020 at 09:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/enforcement-directorate-arrests-yes-bank-promoter-rana-kapoor-in-dhfl-money-laundering-case/articleshow/74534113.cms

No comments