Breaking News

పెరుగుతున్న కోవిడ్ ముప్పు.. దేశవ్యాప్తంగా అంటువ్యాధుల చట్టం అమలు


కోవిడ్ 19‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మహమ్మారిగా ప్రకటించిన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ‘అంటురోగాల చట్టం-1897’లోని సెక్షన్‌-2 నిబంధనల్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఆదేశించింది. క్యాబినెట్ సెక్రెటరీ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన కార్యదర్శులు, ఆర్మీ, ఐటీబీపీ తదితర విభాగాలకు సంబంధించిన ప్రతినిధులు పాల్గొన్నారు. కేంద్ర, రాష్ట్రాల ఆరోగ్య మంత్రిత్వశాఖలు ఎప్పటికప్పుడు జారీ చేసే సూచనలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుందని తాజా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే, విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్‌-10 ప్రకారం కేంద్ర హోంశాఖ కార్యదర్శికి ఉండే అధికారాలను ఆరోగ్యశాఖ కార్యదర్శికి కూడా కేంద్రం దఖలుపర్చింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాప్తి నివారణకు చేపడుతోన్న చర్యలను పర్యవేక్షించేందుకు, ప్రభుత్వ యంత్రాంగాలను మరింత సన్నద్ధం చేయడానికి ఇవి దోహదం చేస్తాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాలు రూపొందించే ప్రణాళికల అమలును పర్యవేక్షించే సమగ్ర అధికారాలను సెక్షన్‌-10 కల్పిస్తుంది. కట్టడి, సన్నద్దత, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటుచేసిన ఉన్నత స్థాయి మంత్రుల బృందం విడిగా సమావేశమయ్యింది. ఈ సందర్భంగా అధికారులు తీసుకుంటున్న చర్యలపై ఈ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి.. పౌరవిమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పూరీ, విదేశాంగ మంద్రి జయశంకర్, హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ హాజరయ్యారు. చైనా, హాంకాంగ్‌, కొరియా, జపాన్‌, ఇటలీ, థాయ్‌లాండ్‌, సింగపూర్‌, ఇరాన్‌, మలేసియా, ఫ్రాన్స్‌, స్పెయిన్‌, జర్మనీ పర్యటనకు వెళ్లొచ్చినవారు 14 రోజుల పాటు తప్పనిసరిగా తమ ఇళ్లకే పరిమితం కావాలని ఆదేశించారు. కరోనా వైరస్ లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, హెల్ప్‌లైన్ నెంబరు గురించి ఐఈసీ (ఇన్ఫరేషన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్) ద్వారా అవగాహన కల్పిస్తున్నట్టు ఆరోగ్య కార్యదర్శి ప్రీతీ సుడాన్ తెలిపారు. అదనంగా క్యారంటైన్ కేంద్రాల గుర్తింపు, ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు, ఆరోగ్య కార్యకర్తలు, వైద్యులకు శిక్షణ తమ అధీనంలో జరుగుతున్నట్టు పేర్కొన్నారు. చైనా, సింగ్‌పూర్, థాయ్‌లాండ్, హాంకాంగ్, జపాన్, దక్షిణ కొరియా, వియత్నాం, నేపాల్, ఇండోనేషియా, ఇరాన్, ఇటలీ మొత్తం 12 దేశాల నుంచి వచ్చిన ప్రయాణికుల స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు వివరించారు.


By March 12, 2020 at 11:27AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/govt-calls-for-invoking-provisions-of-epidemic-act-1897-due-to-covid-19-outbreak/articleshow/74589068.cms

No comments