Breaking News

AP Budget: కేసీఆర్ బాటలో జగన్..?


మార్చి నెలాఖరులో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించడానికి సర్కారు సన్నాహాలు చేస్తోంది. మార్చి 28 నుంచి 4 రోజులపాటు ఈ సమావేశాలను నిర్వహించే అవకాశం ఉందని సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మార్చి నెలాఖరులో 2020-21 ఆర్థిక సంవత్సరానికి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. ముందుగా రెండు నెలల కాలానికి అవసరమైన ఖర్చుల కోసం కొంత మొత్తానికి సభ ఆమోదం పొందుతారని తెలుస్తోంది. కాగా ఈ బడ్జెట్లో జగన్ విశాఖకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. విశాఖ నగరాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్‌గా ఏర్పాటు చేస్తామని జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో విశాఖ నగరాభివృద్ధి కోసం జగన్ భారీగా నిధులు కేటాయించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. విశాఖ నగరంపై పెట్టుబడి పెడితే అది ఆంధ్ర భవితకు పెట్టుబడి అవుతుందంటున్నారు మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు. తెలంగాణ సర్కారు ఇటీవలే బడ్జెట్ ప్రవేశపెట్టగా.. హైదరాబాద్ నగరం, మూసీ ప్రక్షాళన కోసం ప్రత్యేకంగా రూ.10 వేల కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. ఐదేళ్లలో హైదరాబాద్ నగరాభివృద్ధి కోసం రూ.50 వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రకటించారు. ఈ విషయాన్ని ప్రస్తావించిన ఐవైఆర్.. హైదరాబాద్‌పై పెట్టుబడి తెలంగాణకు భవితకు పెట్టుబడి అవుతుందన్నారు. వైజాగ్ విషయంలోనూ అలాగే జరుగుతుందన్నారు. నగరాల్లో మౌలిక సదుపాయాలు పెరిగి పెట్టుబడులు పెరగడానికి సరైన ప్రదేశాలుగా గుర్తించినప్పుడే.. రాష్ట్రాల ఆదాయాలు పెరుగుతాయన్నారు. ఈ బడ్జెట్లో విశాఖ నగరం కోసం కనీసం రూ.20 వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు.


By March 10, 2020 at 11:36AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/former-cs-iyr-krishna-rao-suggests-ap-cm-ys-jagan-to-allocate-rs-20000-cr-for-vizag-in-budget-2020-21/articleshow/74561256.cms

No comments