Breaking News

దేశంలో 315కి చేరిన కరోనా కేసులు.. మరో దశలోకి వైరస్


దేశంలో మరో స్థాయికి ప్రవేశించే ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కేంద్రం హెచ్చరించింది. వైరస్ నియంత్రణలో భాగంగా నేడు నిర్వహించే జనతా కర్ఫ్యూను విజయవంతం చేయాలని కేంద్రం పిలుపునిచ్చింది. ప్రస్తుతం దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య 315కి చేరుకుంది. శనివారం ఒక్క రోజే 80కిపైగా కేసులు నమోదు కావడంతో వైరస్ మూడో దశలోకి ప్రవేశించే ప్రమాదం పొంచి ఉంది. గత మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా 200పైగా కరోనా వైరస్ కేసులు నమోదు కావడం కలవరానికి గురిచేస్తోంది.అత్యధికంగా మహారాష్ట్రలో 65 కేసులు నమోదు కాగా, కేరళలోనూ 42 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. తెలంగాణలోనూ కరోనా వైరస్ క్రమంగా వ్యాప్తిచెందుతోంది. శనివారం కొత్తగా మరో ఇద్దరికి వైరస్ నిర్ధారణ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 21కి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రెండో దశలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారికే వైరస్ నిర్ధారణ కాగా, శనివారం కీలక పరిణామం చోటుచేసుకుంది. వైరస్ సోకిన వ్యక్తి నుంచి మరో వ్యక్తి సంక్రమించింది. దుబాయి నుంచి హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారికి మూడు రోజుల కింద కోవిడ్ -19 నిర్ధారణ కాగా, శనివారం ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి వైరస్ సోకినట్టు గుర్తించారు. దుబాయ్‌ నుంచి వచ్చి మరో యువకుడికి వైరస్ నిర్ధారణ అయ్యింది. ఆంధ్రప్రదేశ్‌లోనూ శనివారం మరో రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసులు ఐదుకు చేరుకున్నాయి. కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లో రెండు కేసులను పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం శనివారం రాత్రి వెల్లడించింది. విదేశాల నుంచి ఏపీకి 12,953 మంది వచ్చినట్లు ప్రభుత్వ సిబ్బంది గుర్తించారు. వీరిలో అనుమానాస్పదంగా ఉన్న 142 మంది శాంపిళ్లను పరిశీలించగా రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మిగతా 130 మందికి కరోనా నెగిటివ్‌గా నిర్దారణ అయింది. ఇంకా ఏడుగురు శాంపిల్స్‌కు సంబంధించిన రిపోర్టుల కోసం అధికారులు వేచి చూస్తున్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా నలుగురు మృతిచెందారు. ఢిల్లీ, కర్ణాటక, మహారాష్ట్ర, పంజాబ్‌లో ఒక్కొక్కరు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు 25 మంది బాధితులు కోలుకున్నట్టు కేంద్రం తెలిపింది. మహారాష్ట్రలో 65, కేరళలో 42, ఢిల్లీలో 26, ఉత్తరప్రదేశ్‌లో 24, కర్ణాటకలో 15,లడఖ్ 13, తెలంగాణ 21, రాజస్థాన్ 17, హర్యానా 17, జమ్మూ కశ్మీర్‌లో 6, గుజరాత్ 7, ఆంధ్రప్రదేశ్ 5, మిగతా రాష్ట్రాల్లో రెండు, ఒక్కొక్కటి చొప్పున నమోదయ్యాయి. మొత్తం 315 కేసుల్లో 39 మంది విదేశీయులు ఉన్నట్టు పేర్కొంది.


By March 22, 2020 at 08:01AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/coronavirus-cases-in-the-country-stands-at-315-covid-19-enter-into-another-state/articleshow/74755005.cms

No comments