Breaking News

హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో 14 కోవిడ్ అనుమానిత కేసులు


దేశంలోనూ కేసులు పెరుగుతుండటంతో దీనిని అరికట్టడానికి కేంద్రం పటిష్ఠ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా విదేశాల నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రయాణికుడికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 557 విమానాల్లో భారత్‌కు విదేశాల నుంచి వచ్చిన 76,670 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించినట్టు పౌరవిమానయాన శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. వీరిలో 24 మందిలో కోవిడ్ లక్షణాలున్నట్టు గుర్తించామని, తదుపరి పరీక్షలకు తరలించామని తెలిపారు. ‘కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్న ప్రయాణికులను ప్రత్యేక పరిశీలన కోసం తరలించాం.. వీరంతా నేరుగా లేదా బంగ్లాదేశ్, ఒమన్, సౌదీ అరేబియా, సింగ్‌పూర్, ఇటలీ, యూఏఈ, మలేషియా నుంచి దేశంలోకి వచ్చారు. వీరిలో ఒకరు ఇటలీ నుంచి అబుదాబి మీదుగా, మరొకరు తైవాస్, మరో ముగ్గురు సింగ్‌పూర్ నుంచి వచ్చారు’అని వివరించారు. కాగా, హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 7న 4,656 మంది సహా ఇప్పటి వరకు విదేశాల నుంచి వచ్చిన 31,763 మందికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించామని తెలిపారు. వీరిలో 19 మందికి కరోనా వైరస్ అనుమానిత లక్షణాలున్నట్టు గుర్తించామని, వీరిలో ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించి ఐసోలేషన్‌లో ఉంచినట్టు తెలిపారు. 19 మంది రక్త నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించగా, ఐదుగురికి నెగెటివ్ వచ్చిందని, మిగతా 14 మంది ఫలితాల రావాల్సి ఉందని అన్నారు. మరోవైపు, ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయుల శాంపిల్స్‌‌తో బయలుదేరిన మహన్ విమానం ఢిల్లీకి శనివారం ఉదయం చేరుకుంది. ఈ విమానం 108 మంది నమూనాలను తీసుకురాగా, ఇక్కడ చిక్కుకున్న ఇరాన్ పౌరులను తొలి విడతగా 200 మందిని తీసుకెళుతుందని అధికారులు పేర్కొన్నారు. ఈ శాంపిల్స్‌ను పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపుతామని, ఫలితాలు రావడానికి 12 గంటలు పడుతుందని తెలియజేశారు. ఫలితాల్లో నెగిటివ్ వచ్చినవారిని స్వదేశానికి తీసుకురానున్నారు. అక్కడ చికుక్కున్న 2,000 భారతీయులను మహాన్ విమానం ద్వారా తీసుకొస్తారు. తిరుగు ప్రయాణంలో ఇది ఇరాన్ పౌరులను తీసుకెళుతుంది. కేంద్ర ఆరోగ్య శాఖ సూచనలతో 30 అంతర్జాతీయ విమానాశ్రయాలలో కరోనా తీవ్రత అధికంగా ఉన్న చైనా, ఇరాన్, దక్షిణ కొరియా, ఇటలీ, జపాన్, హాంకాంగ్, సింగ్‌పూర్, తైవాన్, ఫ్రాన్స్, స్పెయిన్, బ్రిటన్, అమెరికాల నుంచి వచ్చే ప్రయాణీకులకు ప్రత్యేక ఇమ్మిగ్రేషన్, కస్టమ్ కౌంటర్లు, లగేజి బెల్టులను ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర ఆర్ధిక శాఖ కస్టమ్స్ విభాగానికి ఆరోగ్య మంత్రిత్వశాఖ సంయుక్త కార్యదర్శి సుధీర్ కుమార్ ఓ లేఖ రాశారు. ‘ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మార్చి 5న ఆరోగ్య శాఖ మంత్రి, సీనియర్ అధికారులు పర్యటించి.. కరోనా వైరస్‌ను ఎదుర్కొనడానికి చేసిన ఏర్పాట్లును సమీక్షించారు.. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్న 12 దేశాల నుంచి వచ్చినవారు, మిగతా దేశాల నుంచి వచ్చిన ప్రయాణికులకు ఇమ్మిగ్రేషన్ కౌంటర్, కస్టమ్స్ క్లియరెన్స్ కౌంటర్, బ్యాగేజ్ బెల్ట్‌లు తదితరాలు కలిసే ఉన్నట్టు పరిశీలనలో తేలిందని’ ఆ లేఖలో పేర్కొన్నారు.


By March 08, 2020 at 10:20AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/over-4000-passengers-screened-at-hyderabad-airport-on-saturday-14-suspected-cases-found/articleshow/74534368.cms

No comments