భారత్లో 107కి చేరిన కరోనా కేసులు.. దేశవ్యాప్తంగా హైఅలర్ట్

భారత్లో కేసులు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో కోవిడ్ రెండో దశ కొనసాగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 107 కేసులు నమోదయినట్టు కేంద్ర కుటుంబ ఆరోగ్య సంక్షేమ శాఖ ప్రకటించింది. మహారాష్ట్రలో అత్యధికంగా 31 కేసులు నమోదయ్యాయి. తాజాగా, కోచ్చిన్ ఎయిర్పోర్ట్లో ఓ బ్రిటన్ పౌరుడికి కరోనా వైరస్ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. బ్రిటన్కు చెందిన ఈ వ్యక్తితోపాటు మరో 19 మంది కేరళ పర్యటనకు వచ్చినట్టు అధికారులు తెలిపారు. బాధితుడి వైరస్ లక్షణాలతో బాధపడుతున్నా అక్కడ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మున్నార్ నుంచి వీరంతా కొచ్చిన్కు చేరుకున్నారని పేర్కొన్నారు. ఎమిరైట్స్ విమానం ద్వారా లండన్ వెళ్లేందుకు వీరంతా సిద్ధమైనట్టు వివరించారు. వైరస్ ఉన్నట్టు నిర్ధారణ కావడంతో మొత్తం 19 మందిని విమానం నుంచి కిందికి దించి, వైద్య పరీక్షల కోసం తరలించారు. వీరితో సహా మొత్తం 289 మందిని విమానం నుంచి కిందికి దింపేసినట్టు అధికారులు వివరించారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. కోవిడ్ బాధితుల్లో 17 మంది విదేశీయులు కాగా.. ఇద్దరు మృతి చెందారు. మరో 10 మంది కోలుకున్నారు. ఇక ఇప్పటి వరకు విమానాశ్రయాల్లో 12,29,363 మందిని స్క్రీన్ చేశారు. భారత్లో ఈ వైరస్ వ్యాప్తి రెండో దశలో ఉన్నట్లు గుర్తించిన ప్రభుత్వం దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. వైరస్ కట్టడి చేపట్టాల్సిన అన్ని ప్రత్యామ్నాయాల్నీ సూచించింది. మాస్కులు, శానిటైజర్లను నిత్యావసర వస్తువులుగా ప్రకటించి వాటి తయారీని పెంచాలని సదరు సంస్థలను ఆదేశించింది.
By March 15, 2020 at 01:25PM
No comments