Breaking News

Vadodara Accident గుజరాత్, జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలు.. 21 మంది మృతి


ఉత్తర భారతదేశంలో రహదారులు రక్తమోడాయి. జమ్మూ కశ్మీర్, గుజరాత్‌లో శనివారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదాల్లో 21 మంది దుర్మరణం చెందారు. గుజరాత్‌లోని వడోదర జిల్లాలోని పాద్రా సమీపంలో టెంపోను ట్రక్ ఢీకొట్టిన ఘటనలో 12 మంది దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. మహువాద్ గ్రామం వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలంలో ఏడుగురు మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మరో ఐదుగురు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ చనిపోయారు. క్షతగాత్రులను వడోదర హాస్పిటల్‌కు తరలించిన చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లాలో శనివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. మల్హార్ ప్రాంతంలో వేగంగా వచ్చిన ఓ టాటా సుమో అదుపుతప్పి 300 అడుగుల లోతైన లోయలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలోని ప్రయాణికుల్లో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడినవారిని సమీపంలోని హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందజేస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. మారుమూల ప్రాంతంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో పోలీసులకు సమాచారం అందడంలో జాప్యం జరిగింది. దీంతో సహాయక చర్యలు ఆలస్యమయ్యాయి. స్థానికులే సహాయక చర్యలు చేపట్టి వాహనంలోని క్షతగాత్రులను బయటకు తీశారు. వైద్యం కోసం సమీపంలోని హాస్పిటల్‌కు తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో జమ్మూకు తరలించి చికిత్స అందజేస్తున్నారు.


By February 23, 2020 at 08:22AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-21-killed-in-road-accidents-in-gujarat-jammu-and-kashmir/articleshow/74262838.cms

No comments