Breaking News

Night Food Street: వైజాగ్‌లో నైట్ లైఫ్ మజా.. నైట్ ఫుడ్ స్ట్రీట్ ప్రారంభం


విశాఖపట్నంలో నైట్ లైఫ్ మజాను ఆస్వాదించడం కోసం జగన్ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచి ఉండే.. నైట్ ఫుడ్ బజార్‌ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. ప్రభుత్వ మహిళా కళాశాలకు ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశంలో నైట్ ఫుడ్ స్ట్రీట్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో 25 మంది దుకాణాలు నిర్వహిస్తుండగా... మరో 75 దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఈ నైట్ ఫుడ్ స్ట్రీట్‌లో రకరకాల ఆహారం అందుబాటులో ఉంటుంది. నగర ప్రజలతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి, పర్యాటకులకు వీలుగా ఉండేలా నైట్ ఫుడ్ స్ట్రీట్‌ను ప్రారంభించామని మంత్రి బొత్స తెలిపారు. ఇదే ప్రాంతంలో 30 హ్యాండీక్రాఫ్ట్ షాపులను ఏర్పాటు చేస్తామన్నారు. నగరంలో మరో రెండు మూడు చోట్ల ఇలాంటి స్ట్రీట్‌లను ఏర్పాటు చేస్తామన్నారు. నైట్ ఫుడ్ స్ట్రీట్‌లో ఇడ్లీలు, బజ్జీలు, కబాబ్‌లతోపాటు రకరకాల ఆహార పదార్థాలు లభిస్తాయి. విశాఖ అందాలను తిలకించడానికి వచ్చే పర్యాటకులతోపాటు పనుల మీద నగరానికి వచ్చే ఇతర ప్రాంతాలకు చెందిన వారికి అన్నివేళల్లో ఆహారం దొరికేలా చేయడం కోసం ఈ ఫుడ్ స్ట్రీట్‌‌కు శ్రీకారం చుట్టారు. రానున్న రోజుల్లో సెంట్రల్ పార్కు, ఎంవీపీ కాలనీ, తెన్నేటి పార్కు సమీప ప్రదేశాల్లోనూ ఇలాంటి ఫుడ్ స్ట్రీట్‌లనే ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు.


By February 02, 2020 at 12:02PM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/minister-botsa-satyanarayana-inaugurates-night-food-street-in-visakhapatnam/articleshow/73865440.cms

No comments