Breaking News

YS Jagan: ‘జగన్‌కు అమిత్ షాతో సత్సంబంధాలు.. వైఎస్ మరణించినప్పుడూ ఇలాగే..’


శాసన మండలిని రద్దు చేస్తూ సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏపీ అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ విషయమై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. టీడీపీతోపాటు, జనసేన, బీజేపీ, సీపీఐ తదితర పార్టీలు జగన్ నిర్ణయాన్ని తప్పుబడుతున్నాయి. శాసన మండలిని రద్దు చేయాలని జగన్ సర్కారు నిర్ణయించడంపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. సీఎం జగన్‌కు బీజేపీ అగ్ర నేత, హోం మంత్రి అమిత్ షాతో, ఆయన కుటుంబీకులతో మంచి సంబంధాలు ఉన్నాయని నారాయణ ఆరోపించారు. కేంద్రం హామీతోనే జగన్ మండలి రద్దుకు ధైర్యంగా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నట్టు సీపీఐ నేత నారాయణ తెలిపారు. మండలి ఉండాలని తాము కోరుకోలేదని.. పెట్టినప్పుడు వ్యతిరేకించామన్నారు. జగన్ ఓర్చుకోలేకే తొందరపాటుతో మండలిని రద్దు చేశారన్న నారాయణ.. టీడీపీ ఎమ్మెల్సీలను జగన్ బ్లాక్ మెయిల్ చేశారన్నారు. మండలిని రద్దు చేయాలని అసెంబ్లీ నిర్ణయం తీసుకున్నప్పటికీ.. కార్యరూపం దాల్చడానికి ఏడాదికిపైగా పడుతుందని నారాయణ తెలిపారు. సంవత్సరం ఓపిక పడితే జగన్ పార్టీకి చెందిన వాళ్లే ఎక్కువ మంది ఎమ్మెల్సీలు ఉంటారన్నారు. కానీ జగన్ ఆత్రంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అమిత్ షాతో, ఆయన కుటుంబీకులతో జగన్‌కు మంచి సంబంధాలు ఉన్నాయన్న నారాయణ.. బహుశా వాళ్లు కూడా ఏదో హామీ ఇచ్చి ఉంటారన్నారు. జగన్ తొందరపాటుతో ఎవరూ చెప్పేది వినడం లేదన్నారు. అమరావతి డెవలప్ అయితే తన మార్పు ఉండదని జగన్ భావిస్తున్నారన్నారు. జగన్ సైకలాజికల్ వార్ చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటి సంఘటనను నారాయణ ప్రస్తావించారు. ‘ఆ రోజు నేను వాళ్ల ఇంటికి వెళ్లాను.. అక్కడ సి.సి.రెడ్డి, రవిచంద్ర ఉన్నారు. అప్పటికే జగన్‌ ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేయిస్తున్నారు. జగన్‌లో తొందరపాటు ఉంది.. సీఎం అయినా అది తగ్గలేద’ని సీపీఐ నేత వ్యాఖ్యానించారు. ఢిల్లీలో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


By January 28, 2020 at 09:06AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/cpi-leader-narayana-criticizes-ys-jagan-decision-on-ap-legislative-council/articleshow/73685058.cms

No comments