Breaking News

Kashmir Encounter జమ్మూ కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ముగ్గురు ముష్కరులు హతం


జమ్మూ కశ్మీర్‌లో ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు శుక్రవారం ఉదయం మట్టుబెట్టారు. భద్రతా సిబ్బంది కళ్లుగప్పి శ్రీనగర్‌కు ఓ ట్రక్కులో వెళ్తున్న ఉగ్రవాదులను జమ్మూ సమీపంలోని నగోర్తా టోల్ ప్లాజా వద్ద సైన్యం హతమార్చినట్టు అధికారులు తెలిపారు. శుక్రవారం ఉదయం 5 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనలో ఓ పోలీస్ గాయపడ్డాడు. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై నగోర్తాలోని బన్ టోల్ ప్లాజా వద్ద ఓ ట్రక్కును భద్రత సిబ్బంది ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ సమయంలో అందులో ఉన్న ఉగ్రవాదులు పోలీసులపై కాల్పులు జరిపారు. దీంతో అప్రమత్తమైన సైన్యం ఎదురుకాల్పులు జరపగా, ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరూ అక్కడ నుంచి సమీపంలో అడవిలోకి పారిపోయేందుకు ప్రయత్నించగా సైన్యం వెంబడించి వారిని మట్టుబెట్టింది. ముగ్గురు ఉగ్రవాదుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు డీజీపీ దిల్బాగ్ సింగ్ తెలిపారు. ఆ ట్రక్కులో నలుగురు నుంచి ఐదుగురు ఉగ్రవాదులు ఉన్నట్టు భావిస్తున్నామని, వీరు కథువా జిల్లా హీరానగర్ సెక్టార్‌ గుండా దేశంలోకి చొరబడినట్టు అనుమానిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఉగ్రవాదుల కాల్పుల్లో గాయపడిన పోలీస్‌ను చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. ఉగ్రవాదులు ప్రయాణించిన ట్రక్కు నుంచి ఏకే 47 రైఫిల్స్, గ్రనేడ్లు, కొన్ని మ్యాగిజైన్లు స్వాధీనం చేసుకున్నట్టు జమ్మూ జోన్ ఐజీ ముఖేశ్ సింగ్ వెల్లడించారు. ట్రక్కు క్లీనర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఉగ్రవాదులంతా విదేశీయులేనని, వీరికి స్థానికులు సాయం చేసినట్టు అనుమానిస్తుననారు. టోల్ ప్లాజా వద్ద ఎన్‌కౌంటర్ చోటుచేసుకోవడంతో తక్షణమే తమ దళాలు అక్కడకు చేరుకుని, ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తెచ్చుకున్నాయని సీఆర్పీఎఫ్ అధికార ప్రతినిధి శివనందన్ తెలిపారు. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఇక్కడ భద్రత విధులు నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదుల కదలికల నేపథ్యంలో అదనపు బలగాలను తరలించిన అధికారులు.. జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై వాహానాల రాకపోకలను నిలిపివేశారు. మరోవైపు, ఉధమ్‌పూర్ పరిసరాల్లో విద్యా సంస్థలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీచేశారు. ఆగస్టు 5 తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని జరిగిన తొలి ఉగ్రదాడి ఇదే. ఇక, 2016 నవంబరులో నగోర్తాలోని ఇండియన్ ఆర్మీ కంటోన్మెంట్‌పై ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఇద్దరు అధికారుల సహా ఏడుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసు దుస్తుల్లో ఆర్మీ క్యాంప్‌లోకి చొరబడిన ముష్కురులు విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.


By January 31, 2020 at 10:30AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-terrorists-killed-after-gun-battle-near-toll-plaza-near-nagorta-in-jammu/articleshow/73792236.cms

No comments