Breaking News

పాక్ హనీ ట్రాప్‌లో నేవీ ఉద్యోగులు: నేరుగా వారి ఖాతాల్లోకే డబ్బు.. దర్యాప్తులో మరిన్ని వాస్తవాలు


పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో నౌకాదళానికి చెందిన ఉద్యోగులను గత డిసెంబరులో విశాఖ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నేవీ ఇంటెలిజెన్స్‌, కేంద్ర నిఘావర్గాలు ‘ఆపరేషన్ డాల్ఫిన్స్‌ నోస్‌’ పేరిట సంయుక్తంగా నిర్వహించి వీరిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా, ఈ వ్యవహారంలో మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నిందితులను జనవరి 18, 22న జాతీయ దర్యాప్తు సంస్థ కస్టడీకి తీసుకుని విచారించింది. ఈ సందర్భంగా నిందితులు కీలక విషయాలను వెల్లడించారు. పాక్ గూఢచారి సంస్థ ట్రాప్‌లో చిక్కుకుని దేశానికి సంబంధించిన కీలక రహస్యాలను చేరవేసినట్టు ఎన్ఐఏ విచారణలో వెల్లడయ్యింది. అంతేకాదు, కీలక సమాచారం చేరవేసినందుకు వీరికి పాక్ నుంచి భారీగా డబ్బు అందినట్టు తేలింది. ఈ నగదు వారి వేతన ఖాతాలు, బంధువులు, సన్నిహితుల ఖాతాలకు ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున నిధులు జమైనట్టు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో అరెస్టయిన హవాలా ఆపరేటర్లు ఇంతియాజ్‌ సయ్యద్‌, షేక్‌ సహిస్థాలు.. పాకిస్థాన్‌ ప్రతినిధుల ఆదేశాల మేరకు నేవీ ఉద్యోగుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసినట్టు తేల్చింది. అంతేకాదు, ఉగ్రదాడుల సన్నాహక కార్యక్రమాల్లో తాము పాలుపంచుకుంటున్నామనే విషయం నిందితులందరికీ తెలుసని వెల్లడయ్యింది. ఎన్ఐఏ విచారణ సందర్భంగా ఈ కేసులో తమ ప్రమేయాన్ని, నేరపూరిత చర్యలను నిందితులే అంగీకరించినట్లు తెలుస్తోంది. ఫేస్‌బుక్‌, ఈ-మెయిల్‌ ద్వారా ఐఎస్‌ఐ ప్రతినిధులతో నిందితులు తరుచూ మాట్లాడిన విషయాన్ని ఎన్‌ఐఏ గుర్తించింది. సాంకేతిక నిపుణుల సాయంతో సోషల్ మీడియా ఖాతాలను తెరచి అందులోని సమాచారాన్ని విశ్లేషించారు. ఈ సంభాషణల్లో సింభ భాగం నేరపూరిత అంశాలే ఉన్నట్లు ఎన్ఐఏ తేల్చింది. కొన్ని కీలక ప్రతాలను కూడా ఆ ఖాతాల నుంచి స్వాధీనం చేసుకుంది. ఐఎస్ఐ ప్రతినిధులతో సంభాషణల సారాంశమేంటి? ఎప్పుడెప్పుడు ఎలాంటి సమాచారం పాక్‌కు చేరింది? అనే అంశాలపై మరింత లోతైన విచారణ చేస్తోంది. గూఢచర్యం ఆరోపణల కేసులో ఇప్పటివరకూ 13 మందిని ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఇద్దరు హవాలా ఆపరేటర్లు కాగా, 11 మంది నేవీ ఉద్యోగులు.. వీరంతా పాతికేళ్లలోపు వయసున్న వాళ్లే కావడం విశేషం. సున్నీకుమార్‌ అలియాస్‌ సున్నీ సింగ్‌, అశోక్‌కుమార్‌ డెగ్‌, సంజయ్‌కుమార్‌దాస్‌, అశోక్‌కుమార్‌, సోమ్‌నాథ్‌ సంజయ్‌ ఇకడే, సంజయ్‌కుమార్‌, వికాస్‌కుమార్‌, సోనుకుమార్‌, కలవలపల్లి కొండబాబు, అవినాష్‌ సోమల్‌లు వాట్సాప్‌ ద్వారా యుద్ధనౌకలు, జలాంతర్గాముల గురించి సమాచారాన్ని, నౌకాదళ కార్యకలాపాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పాక్‌ నిఘా విభాగం అధికారులకు చేరవేసినట్టు దర్యాప్తులో తేలింది. అలాగే కీలక స్థావరాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను పంపించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. నిందితుల ఈ-మెయిల్స్‌లో చేతిరాతతో కూడిన కొన్ని కీలక పత్రాలు ఎన్‌ఐఏకు లభించాయి. వారిని అరెస్టు చేసినప్పుడూ కొన్ని డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. ఈ చేతిరాత ఎవరిదో తెలుసుకోడానికి డాక్యుమెంట్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు ఎన్‌ఐఏ పంపింది. దీనిని సరిపోల్చేందుకు నిందితుల సంతకాలనూ కూడా సేకరించింది.


By January 30, 2020 at 09:00AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/navy-personnel-links-with-pakistan-spy-racket-accuses-reveals-key-things-in-nia-inquiry/articleshow/73755285.cms

No comments