Breaking News

మసీదుల్లో మహిళలకూ ప్రవేశం.. కానీ, ఈ విషయం కోర్టు నిర్ణయించలేదు: ముస్లిం లా బోర్డు


మహిళలనూ మసీదుల్లో ప్రవేశానికి అనుమతించాలని కోరుతూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ వివరణ ఇచ్చింది. ముస్లిం మహిళలూ మసీదుల్లోకి ప్రవేశించి, నమాజ్‌ చేసుకోవచ్చని సుప్రీంకోర్టుకు మంగళవారం తెలియజేసింది. మత సిద్ధాంతాలు, విశ్వాసాలను అనుసరించి మసీదుల్లోకి ప్రవేశించే అనుమతి మహిళలకు ఉందని, ఈ హక్కును వినియోగించుకోవడం పూర్తిగా వారి ఇష్టమని పేర్కొంది. అయితే, మతపరమైన ఈ విషయంలో కోర్టులో జోక్యం చేసుకోలేవని బోర్డు కార్యదర్శి మహమ్మద్‌ ఫజ్లుర్రహీం తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ప్రవేశించి ప్రార్ధనలు చేసుకోవచ్చని, ఇందుకు వారికి అన్ని హక్కులూ ఉన్నాయని వివరించారు. అంతేకాదు, ఈ విషయంలో విరుద్ధమైన మతపరమైన అభిప్రాయాలపై వ్యాఖ్యానించడానికి ముస్లిం పర్సనల్ లా అంగీకరించదని తెలిపారు. పిటిషనర్ లేవనెత్తిన అంశాలు మత సూత్రాలు, సిద్ధాంతానికి సంబంధించినవి ముఖ్యంగా ఇస్లాం సిద్ధాంతాలకు సంబంధించినవని.. మతపరమైన విషయాలలో కోర్టులు జోక్యం సముచితం కాదు అని అభిప్రాయపడింది. ముస్లిం మహిళలు సామూహిక ప్రార్ధనల్లో కచ్చితంగా పాల్గొనాలనే నిబంధన లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డ్ స్పష్టం చేసింది. పిటిషన్‌లో పేర్కొన్న హక్కులు కేవలం మతపరమైన ప్రదేశాల నిర్వహణకు సంబంధించినవి మాత్రమే కావు.. మతపరమైన కార్యకలాపాలను నియంత్రించడంలో కూడా వారు ఆందోళన చెందరని వ్యాఖ్యానించింది. మసీదు నిర్వహణ ముతావలి ఆధ్వర్యంలో సాగుతుందని, ప్రార్ధనలకు ప్రవేశాన్ని క్రమబద్ధీకరించడం ఆయన వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. అయితే, రాజ్యాంగ పరిధిలో బాధ్యత వహించేలా చేయడానికి అవకాశం లేదని వివరించింది. మసీదుల్లోకి మహిళలను అనుమతించే విషయమై జోక్యం చేసుకోవాలంటూ... యస్మీన్‌ జుబెర్‌ అహ్మద్‌ పీర్జాదీ వేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణలో భాగంగా ఏఐఎంపీఎల్‌బీ ఈ సమాధానమిచ్చింది. శబరిమల అయ్యప్ప ఆలయంతోపాటు మసీదుల్లోకి మహిళల ప్రవేశంపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ కొనసాగుతోంది.


By January 30, 2020 at 08:19AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/muslim-women-can-enter-mosque-but-supreme-court-cant-rule-on-it-says-aimplb/articleshow/73754289.cms

No comments