Breaking News

భారత్‌కు మరో దౌత్య విజయం: ఈయూలో పాక్ మిత్రులకు షాక్.. సీఏఏ వ్యతిరేక తీర్మానంపై ఓటింగ్ వాయిదా!


పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ప్రవేశ పెట్టిన తీర్మానంపై ఓటింగ్‌ను వాయిదావేయాలని పార్లమెంట్ బుధవారం నిర్ణయించింది. కీలకమైన ఈ తీర్మానంపై బుధవారం చర్చ చేపట్టినా భారత్‌కు ఉపశమనం కలిగేలా ఓటింగ్‌ను మాత్రం మార్చికి వాయిదా వేసింది. రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న ఈ తీర్మానాన్ని ఐదు గ్రూప్‌లు సంయుక్తంగా ప్రవేశపెట్టాయి. మొత్తం 771 మంది సభ్యులున్న ఈయూ సమాఖ్యలో బుధవారం 500 మంది హాజరయ్యారు. అయితే, తీర్మానంపై చర్చ జరిగే సమయానికి 483 మంది ఉండగా, 277 మంది ఓటింగ్‌ను వాయిదా వేయాలని కోరగా, 199 మంది మాత్రం తక్షణమే ఓటింగ్ నిర్వహించాలని కోరారు. దీంతో ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేశారు. అయితే, తీర్మానంపై ఓటింగ్ వాయిదాను వేయాలని ఐరోపా సమాఖ్య నిర్ణయం తీసుకోడానికి భారత్ చేసిన దౌత్య ప్రయత్నాలే కారణమని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. పౌరసత్వ సవరణ చట్టంపై నెలకున్న అపోహలను, దాని ప్రాధాన్యతను ఐయూ సమాఖ్యకు వివరించడంలో భారత్ సఫలమైంది. దీంతో ఓటింగ్‌ను వాయిదావేసే ప్రతిపాదనను సెంటర్ రైట్ యూరోపియన్ పీపుల్స్ పార్టీకి చెందిన సభ్యుడు మైకేల్ గాహ్లర్ ప్రవేశపెట్టారు. ఐయూలో ఈ పార్టీకి అధిక సంఖ్యలో 182 మంది సభ్యులు ఉన్నారు. ఇక, సీఏఏకి వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టడంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ సంతతికి చెందిన బ్రిటన్ పౌరుడు షఫక్ మహ్మద్ కీలక పాత్ర పోషించినట్టు భారత్ బలంగా నమ్ముతోంది. ఐరోపా పార్లమెంట్‌లో పాకిస్థాన్ అనుకూల వర్గంపై భారత్ అనుకూల వర్గం పైచేయి సాధించింది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రిటన్ విడిపోవడానికి ముందే రోజే సీఏఏ వ్యతిరేక తీర్మానం ప్రవేశపెట్టడానికి షఫాక్ తీవ్రంగా కృషి చేశారు. ఇక, బ్రెగ్జిట్ జనవరి 31 నుంచి అమల్లోకి రానుండటంతో ఐయూ పార్లమెంట్‌లో బ్రిటన్ సభ్యులకు స్థానం ఉండదు. అలాగే సీఏఏ అంశం తమ అంతర్గత వ్యవహారమని, దీనిని ప్రజాస్వామ బద్ధంగా ఎన్నికైన సభ్యులు ఆమోదించారని భారత్ స్పష్టం చేసింది. భారత్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ఐరోపా సమాఖ్య.. ఓటింగ్‌ను వాయిదా వేసినట్టు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.


By January 30, 2020 at 11:15AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/big-diplomatic-win-for-india-european-parliament-puts-off-vote-on-anti-caa-resolution/articleshow/73758572.cms

No comments