Breaking News

ఆ భార్య అన్నంత పనీ చేసింది.. భర్త చనిపోయిన వారానికే..


ఆ భార్య అన్నంత పనీ చేసేసింది. భర్త బతికుండగా చెప్పిన మాటను నిజం చేసింది. అప్పుడు ఎందుకు అంటుందో అర్థం చేసుకోలేకపోయిన కుటుంబ సభ్యులు తీరా ఊహించని పరిణామంతో షాక్‌కు గురయ్యారు. భర్త మరణాన్ని తట్టుకోలేక పది రోజులకే ఆత్మహత్య చేసుకుంది. అమ్మానాన్న లేకుండా కూతురు కష్టపడుతుందనుకుందేమో ఆమెనూ తన వెంటే తీసుకెళ్లింది. కూతురితో సహా రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషాద సంఘటన జిల్లాలో జరిగింది. అన్యోన్యంగా సాగుతున్న కాపురంలో అనారోగ్యం రూపంలో కల్లోలం రేగింది. భర్త చనిపోవడంతో తల్లడిల్లిపోయిన భార్య కూతురుతో సహా ఆత్మహత్య చేసుకుంది. నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం చిలమనూరుకు చెందిన దాసరి వెంకట శ్రీనివాసులు, సీతారాజ్యలక్ష్మి భార్యాభర్తలు. వారికి ఒక కూతురు కావ్య(7) సంతానం. కొద్దిరోజులుగా అనారోగ్యానికి గురైన భర్త శ్రీనివాసులు బోగి పండుగ ముందురోజు మరణించాడు. Also Read: భర్త బతికి ఉన్న సమయంలో సీతారాజ్యలక్ష్మి.. నీకేమైనా జరిగితే వారం రోజులకే తాను కూడా చనిపోతానని భర్తతో అంటూ ఉండేది. ఇదే విషయాన్ని భర్త.. తన కుటుంబ సభ్యులు, బంధువులకు చెప్పి బాధపడేవాడు. అనారోగ్యం ముదిరి భర్త చనిపోవడంతో భార్య కుంగిపోయింది. తనకు, తన బిడ్డకు దిక్కెవరని బాధపడతుండేది. భర్త శ్రీనివాసులు చెప్పిన మాటలు గుర్తుంచుకున్న ఆయన బంధువులు ఏమైనా అఘాయిత్యానికి పాల్పడుతుందేమోనన్న భయంతో సీతారాజ్యలక్ష్మిని ఎక్కడికీ వెళ్లనిచ్చేవారు కాదు. కానీ రెండు రోజుల క్రితం భర్త బీమా డబ్బుల కోసం వెళ్లాలని చెప్పి కూతురిని తీసుకుని ఊరి నుంచి బయలుదేరింది. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో బంధువులు ఆమెకు ఫోన్ చేయగా స్విచాఫ్ అని వచ్చింది. మరుసటి రోజు ఉదయాన్నే మళ్లీ ఫోన్ చేయగా రైల్వే పోలీసులు ఫోన్ లిఫ్ట్ చేసి కూతురుతో సహా రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా చెప్పడంతో హతాశులయ్యారు. విషాదంలో మునిగిపోయారు. మృతులను సీతారాజ్యలక్ష్మి, ఆమె కూతురు కావ్యగా గుర్తించారు. Read Also:


By January 26, 2020 at 08:17AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/mother-with-daughter-commits-suicide-on-rail-track-in-nellore/articleshow/73625853.cms

No comments