Breaking News

కాకినాడలో కరోనా వైరస్ కలకలం.. నలుగురు చనిపోయారంటూ వదంతులు


చైనాను వణికిస్తోన్న కరోనా వైరస్‌ ఇండియాకు కూడా పాకింది. దేశంలో తొలి కేసు కేరళలో నమోదైంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ గురించి వదంతులు వ్యాప్తిస్తున్నాయి. చైనా నుంచి అవనిగడ్డ వచ్చిన వైద్య విద్యార్థినికి కరోనా వైరస్ సోకిందని గురవారం ప్రచారం జరగ్గా.. తాజాగా కాకినాడ, గుంటూరు జిల్లాల్లోనూ వందతులు వ్యాపించాయి. కరోనా వైరస్ సోకిన పది మంది హాస్పిటల్లో చేరారని.. నలుగురు చనిపోయారనే వార్త కలకలం రేపింది. ఓ డాక్టర్ పేరిట వాట్సప్‌‌లో మెసేజ్‌ రావడంతో జనం బెంబేలెత్తారు. ఈ ప్రచారాన్ని డాక్టర్లు ఖండించారు. విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా వైరస్ సోకే అవకాశం ఉండటంతో.. విమానాశ్రాయాల్లో ప్రయాణికులకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రాజమండ్రి ఎయిర్‌పోర్టుతోపాటు కాకినాడ పోర్టులోనూ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఇన్సోలేషన్ వార్డులను సైతం ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రెండు వారాల క్రితం చైనా నుంచి కాకినాడ వచ్చిన విద్యార్థికి వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. అతడిలో కరోనా వైరస్ లక్షణాలేవీ లేవన్నారు. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయనే ప్రచారం జరిగింది. కానీ ఇదంతా ఉత్తిదేనని తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ కేసులేవీ నమోదు కాలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. వదంతులను నమ్మొద్దని, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.


By January 31, 2020 at 11:32AM


Read More https://telugu.samayam.com/andhra-pradesh/news/coronavirus-rumors-spread-in-kakinada-doctors-says-no-case-detected-in-andhra/articleshow/73794154.cms

No comments