Breaking News

సీఏఏకి వ్యతిరేకంగా కేరళలో 620 కి.మీ. మానవహారం.. నేడు బెంగాల్ అసెంబ్లీలో తీర్మానం


కేంద్రం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. దీనిని వ్యతిరేకిస్తూ కేరళ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేశాయి. తాజాగా సీఏఏ ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తూ కేరళలో ఆదివారం 620 కిలోమీటర్ల పొడవైన ఏర్పాటుచేశారు. కేరళ అధికార పార్టీ సీపీఎం నేతృత్వంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. కాసర్‌గడ్‌ నుంచి కలియక్కవిలయ్‌ వరకు మొత్తం 630 కిలోమీటర్ల పొడవునా ఈ మానవహారం సాగింది. కేరళ సీఎం పినరయి విజయన్‌ సహా పలువురు కీలక నేతలు ఇందులో పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు 75 లక్షల మంది ఇందులో పాల్గొన్నట్టు నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా రాజ్యాంగం పీఠికను చదివి వినిపించారు. మరోవైపు, సీఏఏ, ఎన్పీఆర్‌ వ్యతిరేక ఆందోళనకు 300 మంది ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ రెండు నిర్ణయాలు ‘భారత దేశ ఆత్మ’ను దెబ్బతీసేవిగా ఉన్నాయని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రకటనపై సంతకాలు చేసిన వారిలో బాలీవుడ్ సీనియర్ నటుడు నసీరుద్దీన్‌ షా, నిర్మాత మీరా నాయర్‌, గాయకుడు టి.ఎం.కృష్ణ, విద్యావేత్త రొమిలా థాపర్‌ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా, పౌరసత్వ సవరణ చట్టానికి (సీఏఏ) వ్యతిరేకంగా పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం అసెంబ్లీలో సోమవారం తీర్మానం ప్రవేశపెట్టనుంది. అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మధ్నాహ్నం 2 గంటలకు ఈ తీర్మానాన్ని సీఎం ప్రవేశపెడతారు. ఈ తీర్మానానికి అన్ని పార్టీలు మద్దతివ్వాలని మంత్రి పి.ఛటర్జీ కోరారు. సీఏఏ, ఎన్ఆర్‌సీని తొలి నంచి వ్యతిరేకిస్తోన్న మమతా.. పశ్చిమబెంగాల్‌లో అమలు చేసే ప్రసక్తే లేదని తెగేసిచెప్పారు. ఈశాన్య రాష్ట్రాలతో పాటు బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు కూడా అసెంబ్లీలో సీఏఏ వ్యతిరేక తీర్మానాలు ప్రవేశపెట్టాలని మమత ఇటీవల కోరారు. ఇప్పటికే కేరళ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలు సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించాయి.


By January 27, 2020 at 10:37AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/620-km-human-chain-formed-against-caa-in-kerala-bengal-govt-will-passed-resultion-in-assembly/articleshow/73653847.cms

No comments