Breaking News

త్వరలో ఢిల్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్‌ కోసం రంగంలోకి ప్రశాంత్ కిశోర్


2014 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయంతో ఎన్నికల వ్యూహకర్త పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఆ తర్వాత మోదీతో విభేదాలు తలెత్తడంతో బీజేపీకి బైబై చెప్పేశారు. బీహార్‌లో నితీశ్ విజయానికి బాటలు వేసిన ప్రశాంత్.. యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పనిచేశారు. అయితే, యూపీలో ఆయన వ్యూహాలు ఫలించలేదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయంలో కీలక పాత్ర పోషించారు. రెండేళ్ల పాటు జగన్‌కు ఎన్నికల వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్ సేవలందించారు. తాజాగా ఆయన ఆమ్ ఆద్మీ పార్టీకి తన సేవలను వినయోగించనున్నారు. తర్వలో జరగబోయే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో కేజ్రీవాల్‌తో కలిసి పనిచేయనున్నారు. జనలోక్‌ పాల్ బిల్లు కోసం సామాజిక వేత్త అన్నా హజారేతో కలిసి ఉద్యమించిన అరవింద్‌ కేజ్రీవాల్‌.. అనతి కాలంలోనే ఢిల్లీ గద్దెనెక్కారు. 2012 నవంబరులోనే ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి, డిసెంబరులో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. తొలిసారి ముఖ్యమంత్రిగా 49 రోజులు ఆ పదవిలో కొనసాగిన కేజ్రీ.. జన లోక్‌పాల్ బిల్లుకు ఆమోదం లభించకపోవడంతో రాజీనామా చేశారు. తర్వాత 2015 ఎన్నికల్లో మొత్తం 70 స్థానాలకు గాను 67 చోట్ల ఆప్ అభ్యర్థులే విజయం సాధించడంతో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి మరోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు కేజ్రీవాల్ సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు చెందిన ఐ-ప్యాక్‌(ఇండియన్‌ ప్యాక్‌)తో కేజ్రీ చేతులు కలిపారు. ఈ విషయాన్ని ఆయనే ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ‘ఇండియన్‌ ప్యాక్‌ మాతో కలిసి పనిచేసేందుకు రావడం ఆనందంగా ఉంది. వారికి స్వాగతం పలుకుతున్నాం’ అని కేజ్రీవాల్‌ ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని ధ్రువీకరించిన రీట్వీట్‌ చేస్తూ.. ‘మేం ఎదుర్కొన్న ప్రత్యర్థుల్లో అత్యంత కఠినమైన ప్రత్యర్థి మీరు. పంజాబ్‌ ఫలితాల తర్వాత ఈ విషయం మాకు అర్థమైంది. అరవింద్‌ కేజ్రీవాల్‌, ఆమ్‌ ఆద్మీ పార్టీతో చేతులు కలపడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. ఐ-ప్యాక్‌ ప్రస్తుతం పశ్చిమబెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తోంది. 2021 బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం మమతాబెనర్జీని తిరిగి అధికారం చేపట్టేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు. ప్రశాంత్‌ కిశోర్‌.. జనతాదళ్‌(యునైటెడ్‌) ఉపాధ్యాక్షుడిగా కొనసాగుతున్నారు. పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సొంత పార్టీ నేతలపైనే ఆయన విమర్శలు గుప్పించారు. దీంతో ఆయనను పార్టీ నుంచి తొలగించనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో ప్రశాంత్‌ కిశోర్‌ నేడు భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.


By December 14, 2019 at 01:21PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/i-pacs-prashant-kishore-to-work-with-aap-for-delhi-assembly-polls-says-kejriwal/articleshow/72593608.cms

No comments