Breaking News

మోగిన జార్ఖండ్ ఎన్నికల నగారా.. 81 స్థానాలకు ఐదు దశల్లో పోలింగ్!


జార్ఖండ్‌ శాసనసభ ఎన్నికలకు కేంద్ర షెడ్యూల్ ప్రకటించింది. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొద్ది రోజులకే జార్ఖండ్ ఎన్నికలకు నగారా మోగింది. ఇక్కడ మొత్తం 81 శాసనసభ స్థానాలకు ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రం కావడంతో ఐదు దశల్లో ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. నవంబరు 30 నుంచి డిసెంబరు 20 వరకు పోలింగ్ ఐదు దశల్లో పోలింగ్ నిర్వహించి, డిసెంబరు 23న ఫలితాలు వెల్లడించనున్నారు. జార్ఖండ్‌లో 19 జిల్లాలు నక్సల్‌ ప్రభావిత ప్రాంతాలు కావడంతో 5 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు ప్రధాన ఎన్నికల కమిషనర్ తెలిపారు. నవంబరు 30న తొలి దశలో 20 శాసనసభ స్థానాలకు, డిసెంబరు 7న రెండో దశలో 20 స్థానాలు, డిసెంబరు 12న మూడో దశలో 15 స్థానాలు, డిసెంబరు 16న నాలుగో దశలో 15 స్థానాలు, డిసెంబరు 20న ఐదో దశలో 16 స్థానాలకు పోలింగ్ జరుగుతుందని ఈసీ వెల్లడించింది. ఝార్ఖండ్‌ అసెంబ్లీ గడువు జనవరి 5న ముగిస్తుండగా ఎన్నికల ప్రక్రియను ఈసీ ప్రారంభించింది. గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ.. ఆల్‌ జార్ఖండ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత పూర్తికాలం ఐదేళ్లు పదవిలో కొనసాగిన తొలి సీఎంగా రఘుబర్‌దాస్ గుర్తింపు పొందారు. ఇక, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటర్లు విలక్షణ తీర్పునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన అతిపెద్ద ఈ ఎన్నికల్లో ప్రతిపక్షాలు కూడా పట్టునిలుపుకున్నాయి. హర్యానాలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగా, మహారాష్ట్రలో మాత్రం ప్రతిష్టంభన కొనసాగుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్‌కు మహారాష్ట్ర, హర్యానా ఎన్నికలు కొత్త ఊపిరినిచ్చాయి.


By November 02, 2019 at 08:54AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/ec-announced-jharkhand-assembly-elections-shedule-and-voting-to-be-held-in-5-phases/articleshow/71861466.cms

No comments