Chiranjeevi: సైరా మూవీ చూసొచ్చిన ఆరుగురు ఎస్సైలపై ఎస్పీ ఆగ్రహం

తెలుగు రాష్ట్రాలపై ‘సైరా’ ఎఫెక్ట్ పడింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా చూడటం కోసం ఫ్యాన్స్ ఉత్సాహం చూపుతున్నారు. జగన్ సర్కారు అదనపు షోలు వేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అర్ధరాత్రి ఒంటి గంట నుంచే షోలు ప్రారంభమయ్యాయి. దీంతో ఫ్యాన్స్ ఉత్సాహంగా సినిమా చూస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన ఆరుగురు ఎస్సైలు వేకువజామునే వెళ్లి సినిమా చూసొచ్చారు. దీంతో జిల్లా ఎస్పీ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఆర్కు బదిలీ చేస్తున్నట్టు ప్రకటించారు. సినిమా చూస్తే బదిలీ చేస్తారా.. పోలీసులకు సినిమా చూసే హక్కు లేదా అనుకుంటున్నారా..? కాస్త ఆగండి. అసలు ఏమైందంటే.. సినిమా టికెట్లు దొరకగానే ఆరుగురు ఎస్సైలు కోవెలకుంట్లలోని ఓ థియేటర్లో సినిమా చూశారు. కానీ అప్పుడు వారంతా డ్యూటీలో ఉన్నారు. విధుల్లో ఉండి పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా సినిమాకు వెళ్లడమే వారు చేసిన తప్పు. వ్యవహారం ఎస్పీ దాకా వెళ్లడంతో.. వారిపై బదిలీ వేటేశారు. సినిమాకు వెళ్ళిన ఎస్ఐ లు అవుకు ఎస్.ఐ శ్రీకాంత్ రెడ్డి, కొలిమిగుండ్ల ఎస్.ఐ జగదీశ్వర్ రెడ్డి, నందివర్గం ఎస్.ఐ హరిప్రసాద్, బండి ఆత్మకూర్ ఎస్.ఐ వెంకటసుబ్బయ్య, రాచర్ల ఎస్.ఐ ప్రియతంరెడ్డి, స్పెషల్ బ్రాంచ్ ఎస్.ఐ అశోక్ను వీఆర్కు పంపుతున్నట్టు ఎస్పీ ఫకీరప్ప తెలిపారు. పాపం ఎస్సైలు.. విధుల్లో ఉండగా సినిమాకు వెళ్లకుండా ఉండాల్సింది. ఒక వేళ వెళ్లినా పై అధికారులకు చెప్పి వెళ్తే పరిస్థితి ఇంత వరకు వచ్చి ఉండేది కాదు కదా.
By October 02, 2019 at 12:19PM
No comments