Breaking News

కశ్మీర్‌లో 200 నుంచి 300 మంది ఉగ్రవాదులు.. పాక్ మరిన్ని ప్రయత్నాలు!


జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను రద్దుచేసిన తర్వాత లోయలో విద్వేషాలను రెచ్చగొట్టేందుకు దాయాది శతవిధాలా ప్రయత్నిస్తోంది. కశ్మీర్‌లోకి తీవ్రవాదులను పంపేందుకు సరిహద్దుల్లో కాల్పులు విరమణ ఉల్లంఘనకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ భూభాగంలో వందలాది మంది ఉగ్రవాదులు చొరబాటుకు సిద్ధంగా ఉన్నట్టు నిఘా వర్గాలు హెచ్చరికలు జారీచేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ ఆదివారం చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో దాదాపు 200 నుంచి 300మంది ఉగ్రవాదులు క్రియాశీలకంగా ఉన్నారని ఆయన తెలిపారు. శీతాకాలం మొదలై చలి తీవ్రత పెరగకముందే వీలైనంత ఎక్కువ మంది ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు పాకిస్థాన్ కుట్రలు చేస్తోందని అన్నారు. ఇందులో భాగంగానే కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనల్ని పాక్ సైన్యం తీవ్రతరం చేసిందని పేర్కొన్నారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా రద్దుచేసిన తర్వాత చేస్తున్న చొరబాటు యత్నాలను భద్రత దళాలు సమర్ధంగా తిప్పికొడుతున్నా కొంతమంది ముష్కరులు సరిహద్దు దాటి లోనికి ప్రవేశించారని ఆయన తెలిపారు. వీరిలో చాలా మందిని ఎన్‌కౌంటర్లలో మట్టుబెట్టామని.. మరికొంత మంది పట్టుబడ్డారని తెలిపారు. రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లో పరిస్థితులు క్రమంగా సాధారణ స్థితికి వస్తున్నాయని డీజీపీ వెల్లడించారు. జమ్మూ, లేహ్‌, కార్గిల్‌ ప్రాంతాల్లో పరిస్థితులు శాంతియుతంగానే ఉన్నాయని, కశ్మీర్‌లోనూ క్రమంగా శాంతియువత వాతావరణం నెలకుంటోందని వివరించారు. ఆంక్షలు సడలించడంతో జనం బయటకు వస్తున్నారని, కొన్ని చోట్ల రోడ్లపై ట్రాఫిక్ ఎక్కువగా ఉందన్నారు. మార్కెట్లు, దుకాణ సముదాయాలు తెరుచుకోవడంతో వ్యాపార కార్యకలాపాలు మొదలయ్యాయని అన్నారు. రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత చక్కబడతాయని అన్నారు. చొరబాట్లు యత్నాలు తీవ్రమైన నేపథ్యంలో పోలీసులు, భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని డీజీపీ సూచించారు. ఉరి, రాజౌరి, పూంచ్ సహా పలుచోట్ల కాల్పులు ఉల్లంఘనలు అధికంగా ఉన్నాయని తెలియజేశారు.


By October 07, 2019 at 10:58AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/jammu-and-kashmir-dgp-dilbagh-singh-says-200-to-300-militants-presently-active-in-state/articleshow/71473932.cms

No comments