Breaking News

పెను విషాదం.. గ్యాస్ సిలెండర్ పేలి 11 మంది దుర్మరణం


ఉత్తర్‌ప్రదేశ్‌లో సోమవారం ఉదయం పెను విషాదం చోటు చేసుకుంది. మొహ్మదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి వలీద్‌పూర్‌ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్‌ సిలిండర్‌ పేలిన ఘటనలో 11 మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి రెండంతస్తుల భవనం కుప్పకూలింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇంకొందరు చిక్కుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. పేలుడు తర్వాత భారీ శబ్దం రావడంతో చుట్టుపక్కల ఇళ్లలోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదంపై ఉత్తర్‌ప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపిన ఆయన బాధితులకు అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. ఘటనా స్థలంలో సహాయకచర్యలు వేగవంతం చేయాలని, శిథిలాల్లో చిక్కుకున్న వారిని వీలైనంత తర్వగా బయటకు తీయాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు, శిథిలాల్లో చాలా మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. సహాయక చర్యల్లో పోలీసులకు స్థానికులు సహకరిస్తున్నారు. ఉదయం 7.30 ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. తొలుత సిలెండర్ నుంచి గ్యాస్ లీకై పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది.


By October 14, 2019 at 10:13AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/as-many-as-dead-and-several-injured-in-cylinder-blast-at-uttar-pradesh/articleshow/71574601.cms

No comments