Breaking News

ESI medicines scam: ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణి అరెస్ట్


మందుల కొనుగోళ్ల కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న డైరెక్టర్ దేవికారాణిని ఏసీబీ అధికారులు శుక్రవారం అరెస్ట్ చేశారు. షేక్‌పేటలోని నివాసంలో ఆమెను అదుపులోకి తీసుకున్న అధికారులు నాంపల్లిలోని ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఆమెతో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, మరో ఏడుగురిని కూడా అరెస్ట్ చేశారు. గురువారం దేవికారాణి ఆఫీసులో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో 17మంది ఈఎస్ఐ ఉద్యోగులతో పాటు నలుగురు ప్రైవేట్‌ వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. Also Read: ఈఎస్ఐలోని ఐఎమ్‌ఎస్‌ విభాగంలో మందుల కొనుగోళ్లలో నిబంధనలు తుంగలో తొక్కి కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఇటీవల ఆరోపణలు వెల్లువెత్తాయి. ఐఎమ్‌ఎస్‌ ఉద్యోగులు, మెడికల్‌ ఏజెన్సీలు టెండర్లు లేకుండా నకిలీ బిల్లులతో కోట్లాది రూపాయలు దండుకున్నాయని అనేక ఫిర్యాదులు రావడంతో ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఈఎస్‌ఐ ముఖ్యకార్యదర్శి శశాంక్‌ గోయల్‌ ఏసీబీకి లేఖ రాసారు. వరంగల్ కేంద్రంగా వెలుగులోకి వచ్చిన ఈ స్కాంపై ఏసీబీ రెండు నెలలపాటు విచారణ చేసింది. ఈఎస్ఐకి సంబంధించి పలు రికార్డులను, కొనుగోళ్ల డాక్యుమెంట్లను పరిశీలించిన విజిలెన్స్‌ అధికారులు అక్రమాలను ధ్రువీకరిస్తూ ఏసీబీకి నివేదిక అందించారు. దాదాపుగా గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ కుంభకోణం జరుగుతున్నట్లు ఏసీబీ నిర్ధారించింది. Also Read: ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈఎస్ఐ డైరెక్టర్ దేవికారాణితో పాటు జాయింట్ డైరెక్టర్ పద్మ, ఫార్మసిస్టులు ఎం.రాధిక, జి.జ్యోత్స్న, ఫాతిమా, వి.లావణ్య, కె.నాగలక్ష్మి ఇళ్లలో గురువారం సోదాలు చేపట్టారు. సీనియర్‌ అసిస్టెంట్లు ఎం.సురేంద్రనాథ్‌బాబు, వి.హర్షవర్దన్‌, కె.పావని, కార్యాలయ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, సురేశ్‌ అగర్వాల్‌, ఎస్‌.శ్రీనివాసరావు, కె.వీరన్న, రికార్డు అసిస్టెంట్‌ రాజశేఖర్‌ అలియాస్‌ రాజుతో పాటు ఓమ్నీ మెడి సంస్థకు చెందిన సీహెచ్‌.శివనాగరాజు, తేజ ఫార్మా ఏజెంట్‌ బి.సుధాకర్‌రెడ్డి, ఓమ్నీ మెడి ఎండీ శ్రీహరి, ఓ తెలుగు న్యూస్ ఛానల్ విలేకరి నరేంద్ర ఇంట్లోనూ తనిఖీలు చేపట్టి కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. Also Read: ఈ కుంభకోణంలో సుమారు రూ.10కోట్ల వరకు చేతులు మారినట్లు ఏసీబీ గుర్తించింది. నకిలీ బిల్లులు సృష్టించి, అవసరం లేకున్నా మందులు కొనుగోలు చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించింది. ఈ కేసులో అరెస్టయిన దేవికారాణి, పద్మతో పాటు మిగిలిన వారందరిని ప్రస్తుతం ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిందితులను ఈరోజు మధ్యాహ్నం ఏసీబీలో కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలుస్తోంది.


By September 27, 2019 at 10:44AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/esi-medicines-scam-acb-arrestes-director-devikarani/articleshow/71323120.cms

No comments