Breaking News

హిందీ దివస్.. అమిత్ షా ట్వీట్‌పై దక్షిణాది రాష్ట్రాలు గరంగరం!


హిందీ భాషా దినోత్సవం సందర్భంగా శనివారం కేంద్ర హోం మంత్రి చేసిన వరుస ట్వీట్లపై దక్షిణాది రాష్ట్రాల నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు. ‘ఒకే దేశం-ఒకేభాష’ అంటూ హిందీ భారతదేశ భాష కావాలన్న షా అభిప్రాయాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ‘దేశం మొత్తానికీ ఉమ్మడి భాష ఉండాలి. అత్యధికంగా హిందీ మాట్లాడతారు కాబట్టి ఆ భాషే దేశం మొత్తాన్ని ఒక్కటి చేస్తుంది. ప్రాంతీయ భాషలను అభివృద్ధి పరచుకుంటూనే మహాత్మాగాంధీ, పటేల్‌లు కలలు కన్న ఒకేభాషా స్వప్నాన్ని సాకారం చేసేందుకు హిందీని విస్తృతంగా మాట్లాడాలి’అంటూ అమిత్ షా చేసిన ట్వీట్‌పై పెనుదుమారం రేగింది. తీవ్రంగా స్పందించిన దక్షిణాదికి చెందిన వివిధ పార్టీల నేతలు అమిత్‌ షా వ్యాఖ్యలను ఖండించారు. డీఎంకే, అన్నాడీఎంకె, జేడీఎస్, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. డీఎంకే నేత స్టాలిన్ మాట్లాడుతూ.. అమిత్‌ షా వ్యాఖ్యలపై ప్రధాని మోదీ తప్పనిసరిగా వివరణ ఇస్తూ ప్రకటన చేయాల్సిందేనని, లేని పక్షంలో మరో భాషా ఉద్యమానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు. ఇది ఇండియానా? లేకపోతే ‘హిందియానా’.. అమిత్‌ షా తక్షణం తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాదు, హిందీయేతరులను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూసేలా షా వ్యాఖ్యలు ఉన్నాయని, భిన్నత్వంలో ఏకత్వమే భారత్ బలమని, దీనిని మార్చడానికి ఎవరూ అంగీకరించరని పేర్కొన్నారు. హిందీ జాతీయ భాష అనే పచ్చి అబద్ధాన్ని వల్లెవేయడాన్ని తక్షణం ఆపేయాలని, కన్నడ లాగే దేశంలో మాట్లాడే 22 అధికార భాషల్లో హిందీ కూడా ఒకటని కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య మండిపడ్డారు. ఇది భారత సమాఖ్య వ్యవస్థపై జరుగుతోన్న దాడని, దేశంలోని అన్ని భాషలను సమానంగా పరిగణించాలని సీపీఏ వ్యాఖ్యానించింది. ఆరెస్సెస్‌ హిందూత్వ ఎజెండాలో భాగంగానే మోదీ సర్కారు హిందీని రుద్దాలనుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిభాషా సూత్రానికి తూట్లుపొడవద్దని, రాజ్యాంగ నిర్మాతలు పరిష్కరించిన భావోద్వేగపూరిత సమస్యలను మళ్లీ కదిలించరాదని కాంగ్రెస్ నేత ఆనంద్‌శర్మ హితవుపలికారు. హిందీ, హిందూ, హిందుత్వ కంటే భారత్ చాలా గొప్పదని, ప్రతీ భారతీయుడి మాతృభాష హిందీ కాదని, దేశంలోని ఎన్నెన్నో అమ్మభాషల సొగసును, వైవిధ్యాన్ని కాలరాయడానికి యత్నిస్తారా అంటూ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 ప్రత్యేకమైన భాష, లిపి, సంస్కృతి కలిగిన పౌరుల హక్కులను పరిరక్షించే అవకాశం కల్పించిందని అన్నారు. దేశంలో చాలా భాషలు ఉండగా, కేవలం హిందీ దినోత్సవాన్నే ఎందుకు నిర్వహిస్తున్నారని కర్ణాటక మాజీ సీఎం హెచ్‌డీ కుమారస్వామి నిలదీశారు. భారత సమాఖ్య వ్యవస్థలో కన్నడిగులు కూడా ఓ భాగమని గుర్తుంచుకోవాలి.. హిందీ, కన్నడ లాంటివి దేశ అధికారిక భాషలు.. కాబట్టి కన్నడ దివాస్‌ను ఎప్పుడు నిర్వహిస్తారని? కుమారస్వామి ప్రశ్నించారు. అమిత్ షా ట్వీట్‌పై తమిళనాట మరింత ఆగ్రహావేశాలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ ముఖ్యమంత్రులు అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత నిర్దేశించిన తమిళ, ఇంగ్లీషు బోధన అనే ద్విభాషా సూత్రానికి విరుద్ధంగా రాష్ట్రంపై హిందీని బలవంతంగా రుద్దడానికి కేంద్ర ప్రయత్నిస్తోందని బీజేపీ మిత్రపక్షమైన అధికార అన్నాడీఎంకే పేర్కొంది.


By September 15, 2019 at 09:44AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/home-minister-amit-shah-calls-to-expand-hindi-to-all-parts-of-india-southern-states-seethe/articleshow/71133130.cms

No comments