Breaking News

దేశం యావత్తు మీ వెంటే ఉంది.. అపజయానికి కుంగిపోవద్దు: మోదీ


ప్రయోగించిన ల్యాండర్ విక్రమ్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో చంద్రుడి ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల దూరంలో సంకేతాలు నిలిచిపోయాయి. దీంతో ఇస్రో శాస్త్రవేత్తలు తీవ్ర నిరాశచెందారు. ఈ ప్రాజెక్టు కోసం శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారని, అపజయానికి కుంగిపోరాదని ప్రధాని నరేంద్ర మోదీ వారిలో స్థైర్యాన్ని నింపే ప్రయత్నం చేశారు. శనివారం ఉదయం బెంగళూరులోని ఇస్రో కేంద్రం నుంచి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ.. ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ తన ప్రసంగాన్ని మొదలుపెట్టారు. దేశం యావత్తు మీ వెంట ఉందని, మీ పనితీరుకు భారత్ గర్విస్తోందని అన్నారు. దేశం కోసం మీరంతా పనిచేశారని, భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని ధైర్యం చెప్పారు. గత రాత్రి ఏం జరిగిందో తాను అర్థంచేసుకోగలనని శాస్త్రవేత్తలకు భరోసా ఇచ్చారు. శాస్త్రవేత్తలకు సంఘీభావం తెలియజేస్తున్నామని, చంద్రుడుని చేరుకోవాలనే సంకల్పం మరింత బలంగా మారిందని అన్నారు. మీ మోముల్లో నిరాశను గమనించానని, అయితే ఈ ప్రాజెక్టు కోసం మీరు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారని మోదీ వ్యాఖ్యానించారు. అపజయంతో కుంగిపోరాదని, దీనిని నుంచి పాఠాలు నేర్చుకుని విజయాలను అందుకోవాలని, ఉన్నత శిఖరాలకు చేరుకుంటామని ఉద్ఘాటించారు. సాధించాల్సిన విజయాలు చాలా ఉన్నాయని, ఇస్రో శాస్త్రవేత్తలపై తమకు పూర్తి నమ్మకం ఉందన్నారు. అంతరిక్షంలో మరింత అత్యుత్తమ విజయాలను అందుకుంటారని ఆశిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. మనం చాలా దగ్గరగా వచ్చాం కాని రాబోయే రోజుల్లో మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని సూచించారు. చంద్రయాన్‌-2 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంతగానో శ్రమించారని, వారి మానసిక స్థితిని మేం అర్థం చేసుకోగలమని మీ కృషి ఎప్పటికీ వమ్ము కాదని అన్నారు. భారతమాత తలెత్తుకునేలా జీవితాన్ని ధారపోసి ఈ ప్రయోగం విజయవంతం కావాలని మీరు, మీతో పాటు మేము ఎంతగానో ఆకాంక్షించాం. కానీ జయాపజయాలను ధైర్యంగా స్వీకరించాలని, మీ కష్టం మీ కళ్లలో కనిపిస్తోందని కితాబిచ్చారు. మీరు చేసిన ప్రయోగాలు ప్రతి భారతీయుడూ గర్వంగా తలెత్తుకునేవని, యావత్ దేశం మీకు సంఘీభావంగా రాత్రంతా మేల్కొనే ఉందని చెప్పారు.


By September 07, 2019 at 08:52AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-interacts-with-isro-scientists-after-moon-lander-loses-contact/articleshow/71019737.cms

No comments