Breaking News

పాక్ జవాన్లను హతమార్చిన ఆర్మీ.. తెల్లజెండాలతో వచ్చి మృతదేహాలను తీసుకెళ్లిన పాకిస్థాన్!


కశ్మీర్ విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంతో రగిలిపోతున్న పాకిస్థాన్.. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కశ్మీర్‌లో మారణహోమానికి కుట్రలు పన్నుతూ ఉగ్రవాదులను దేశంలోకి పంపేందుకు భగీరథ ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాల్పులు విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సైనిక స్థావరాలపై దాడికి యత్నిస్తోంది. పాక్ కుటిల ప్రయత్నాలను భారత సైన్యం సైతం దీటుగా తిప్పికొడుతోంది. ఆర్మీ పోస్టులు, సరిహద్దు గ్రామాలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న పాక్ సేనలకు భారత సైన్యం గట్టిగా బదులిచ్చింది. సెప్టెంబరు 10-11 తేదీల్లో హజీపూర్, కెరాన్ సెక్టార్‌లో పాక్ కాల్పులకు తెగబడగా ఆర్మీ ఎదురుదాడి చేసింది. ఈ ఘటనలో ముగ్గురు పాక్ రేంజర్లు హతమాయ్యారు. తోక జాడించిన పాక్‌కు సైన్యం తగురీతిలో బుద్ధిచెప్పింది. దీంతో తెల్లజెండాను చూపిస్తూ వచ్చిన పాక్ జవాన్లు తమ సైనికుల మృతదేహాలను తీసుళ్లారు. మూడు రోజుల కిందట జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. సరిహద్దులో వాస్తవాధీన రేఖ (ఎల్ఓసీ) వెంట ఉన్న హాజీపూర్, కెరాన్ సెక్టార్‌లో భారత ఆర్మీ పోస్టులపై ఈనెల 10,11 తేదీల్లో పాక్ బలగాలు భారీఎత్తున కాల్పులకు తెగబడ్డాయి. దీనికి దీటుగా స్పందించిన భారత్, పాక్ ఆర్మీ పోస్టులే లక్ష్యంగా విరుచుకుపడింది. ఇండియన్ ఆర్మీ దాడిలో ముగ్గురు పాక్ రేంజర్లు హతమవ్వగా, సైనిక నిబంధనల ప్రకారం పాకిస్థాన్ సైనికులు కొందరు తెల్లజెండాతో ముందుకు వచ్చారు. శత్రువులు తెల్లజెండాను చూపిస్తే శాంతి కోరుకుటున్నట్టు సంకేతం. పాక్ కాళ్లబేరానికి రావడంతో భారత బలగాలు తమనుతాము నియంత్రించుకున్నాయి. ఈ సందర్భంగా తమ జవాన్ల మృతదేహాలను పాక్ తీసుకెళ్లింది. ఈ ఘటనకు సంబంధించి ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెప్టెంబరు 10 అర్ధరాత్రి హజీపూర్ సెక్టార్‌లో భారత్ సైన్యం ఎదురుడాడిలో పాకిస్థాన్‌లో పంజాబ్‌లోని బహావల్‌నగర్‌కు చెందిన గులామ్ రసూల్ అనే పాక్ సైనికుడు హతమయ్యాడు. జులై 31న కెరాన్ సెక్టార్‌లో పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడగా భారత్ దీటుగా స్పందించి దాని చర్యలను తిప్పికొట్టింది. ఈ ఘటనలో హతమైన తమ సైనికుల మృతదేహాలను పాక్ తీసుకెళ్లకపోవడంతో వారికి ఇండియన్ ఆర్మీ అంతిమ సంస్కారాలు నిర్వహించింది. కార్గిల్ యుద్ధం సమయంలోను పాక్ సైనికులకు భారత ఆర్మీ అంత్యక్రియలు నిర్వహించడం విశేషం. కాగా, శనివారం ఉదయం పూంచ్ జిల్లాలో ఎల్ఓసీ వెంట, బాలకోట్, మన్‌కోట్ సరిహద్దుల్లో మోర్టార్లతో దాడిచేయగా, సైన్యం వాటిని తిప్పికొట్టినట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.


By September 14, 2019 at 12:55PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pakistan-raised-a-white-flag-atloc-to-retrieve-bodies-of-its-soldiers-killed-by-the-indian-army/articleshow/71123438.cms

No comments