Breaking News

మేనమామతో పెళ్లి ఇష్టంలేక బాలిక ఆత్మహత్య


మేనమామతో తల్లిదండ్రులు నిశ్చయించిన పెళ్లి ఇష్టం లేక ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విశాఖపట్నం జిల్లా రోలుగుంటలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మడ్డు రమణ, సత్యవేణి దంపతులకు అరుణ(17) అనే కుమార్తె ఉంది. అరుణ కొంతకాలంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలోని అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది. చదువు మానేయడంతో అరుణకు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నెల 7వ తేదీన రోలుగుంటలోని ఇంటికి రప్పించారు. మేనమామతో పెళ్లి నిశ్చయించామని, అతడిని పెళ్లి చేసుకోవాలని కోరారు. అయితే తనకు ఇప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదని, మేనమేమ అంటే తనకిష్టం లేదని, అతడిని పెళ్లిచేసుకోలేనని తేల్చి చెప్పింది. అయితే అరుణ తల్లిదండ్రులు మాత్రం మేనమామను పెళ్లి చేసుకోవాల్సిందేనని పట్టుబట్టారు. అదే రోజు రాత్రి తల్లిదండ్రులతో కలిసి భోజనం చేసిన అరుణ గణేశ్ విగ్రహ ఊరేగింపు చూడటానికి వెళ్లింది. అర్ధరాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. ఆమె స్నేహితులు కూడా తమకు తెలీదని చెప్పడంతో మరింత ఆందోళన పడ్డారు. ఆదివారం(సెప్టెంబర్ 8) స్థానిక కొట్టే బావిలో అరుణ మృతదేహాన్ని చూసిన స్థానికులు కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో అరుణ తండ్రి రమణ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు గ్రామానికి చేరుకుని అరుణ మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


By September 10, 2019 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/vizag-girl-commits-suicide-due-to-not-interested-marriage/articleshow/71059559.cms

No comments